Food Crisis | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): దేశంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఈ ఏడాది ఆహార సంక్షోభానికి కారణం కావొచ్చన్న భయాలు మొదలయ్యాయి. ప్రభుత్వ గిడ్డంగుల్లో ఇప్పటికే అడుగంటిన ధాన్యపు నిల్వలు ఒకవైపు ఆందోళన రేపుతుండగా, గోధుమలను పండించే ప్రధాన రాష్ర్టాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు సంక్షోభ భయాలను రెట్టింపు చేస్తున్నాయి.
డిసెంబర్, జనవరిలో పంజాబ్, హర్యానా, హిమాచల్, ఉత్తరాఖండ్ తదితర 6 రాష్ర్టాలు, మరో రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో (యూటీల్లో) 54 శాతం నుంచి 85 శాతం వరకు లోటు వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. దీంతో యాసంగి సీజన్లో ధాన్యం ఉత్పత్తి భారీగా పడిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.
మరోవైపు, ప్రభుత్వ గోదాముల్లో గడిచిన ఏడేండ్లలో ఎన్నడూ చూడని స్థాయికి గోధుమల నిల్వలు పడిపోయాయి. జనవరి 1నాటికి దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వ గోదాముల్లో గోధుమల స్టాక్ 163.53 లక్షల టన్నులుగా ఉన్నట్టు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ), స్టేట్ ఫుడ్ ఏజెన్సీల గణాంకాలను బట్టి తెలుస్తున్నది. 2017 తర్వాత (అప్పుడు 137.47 లక్షల టన్నులు) ఈ స్థాయిలో నిల్వలు పడిపోవడం ఇదే తొలిసారి.