Rising temperature | దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతున్నది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజారోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రాల సీఎస్లకు వైద్యారోగ్యశాఖ లేఖ రాసింది. నేటి నుంచి దేశవ్యాప్తంగా నిత్యం ఎండ తీవ్రతను పరిశీలించనున్నటు పేర్కొంది. రోజువారీగా ఉష్ణోగ్రతల తీవ్రత, వాతావరణ మార్పులకు సంబంధించిన వివరాలు రాష్ట్రాలకు అందించనున్నట్లు పేర్కొంది. ఫలితంగా పట్టణ, జిల్లాల స్థాయిలో వడదెబ్బలను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలవుతుందని చెప్పింది.
రాష్ట్రాలు సైతం తప్పక వడదెబ్బ బాధితుల వివరాలను కేంద్ర ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ ఫాం ఐహెచ్ఐపీలో నమోదు చేయాలని కోరింది. వేడి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ బాధితుల సంఖ్య పెరిగేందుకు అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదుకు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్, ఐస్ప్యాక్లు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించింది. ప్రతి ఒక్కరికీ ఎండ తీవ్రతపై అవగాహన కల్పించేందుకు అవసరమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. వేసవిలో ఎండతీవ్రతతో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించింది. జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చల్లటి నీటి సదుపాయం కల్పించాలన్నది.
వేసవిలో నీటిని ఎక్కువగా తీసుకోవాలని, చల్లని ప్రదేశాల్లో ఉండాలని ఆరోగ్యశాఖ ప్రజలకు సూచించింది. ఆసుపత్రుల్లోనూ తాగునీటి సదుపాయం, చల్లగా ఉండేందుకు అవసరమైన పరికరాలను బిగించుకోవాలని చెప్పింది. ఆర్థిక స్థోమత ఉంటే సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా విద్యుత్ ఆదా అవుతుందని పేర్కొంది. అదే సమయంలో ప్రజలకు సైతం ఆరోగ్యశాఖ సూచనలు చేసింది. ఎండల వేడి నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న 12 నుంచి 3 గంటల లోపు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని చెప్పింది. పిల్లలకు మధ్యాహ్నం బయటకి రాకుండా ఉండేలా వారి తల్లిదండ్రులకు తగిన సూచనలు ఇవ్వాలని చెప్పింది.