న్యూఢిల్లీ : పండగ సీజన్లో వంటనూనెలు, కందిపప్పు వంటి పప్పు ధాన్యాల ధరలు కొండెక్కడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడాది కిందట తాము కొనుగోలు చేసిన ఈ వస్తువుల ధరలు ఇప్పుడు ఏకంగా రూ 10 నుంచి రూ 60 వరకూ భారమవడంతో పిండివంటలకు దూరం కావడంతో పాటు మితంగా వాడేందుకు పరిమితమయ్యారు. పెరిగిన ధరలు వెచ్చించలేక కొందరు కందిపప్పును వాడకపోవడంతో పాటు కొన్ని బ్రాండ్ల వంట నూనెలనూ కొనుగోలు చేయడం లేదు. ఇక గత ఏడాది కిలో కందిపప్పు రూ 97కి లభించగా ఇప్పుడది ఏకంగా రూ 110కి ఎగబాకింది.
వేరుశనగ నూనె రూ 141 నుంచి ఇప్పుడు రూ 159కి చేరింది. మరోవైపు పేదలు వాడే పామాయిల్ గత ఏడాది సెప్టెంబర్లో రూ 92 కాగా ఇప్పుడు రూ 127 పలుకుతోంది. ఇక సన్ఫ్లవర్ ఆయిల్ రూ 100 నుంచి తాజాగా రూ 154కి పెరిగింది. దిగుమతులు తగ్గడంతో పాటు నిత్యావసర వస్తువుల చట్టానికి ఇటీవల చేపట్టిన సవరణలతో వంటనూనెలు, పప్పుధాన్యాల ధరలు పెరిగాయని చెబుతున్నారు. వీటికి తోడు ఉల్లి గడ్డలు, టమాటాల ధర సైతం ఎగబాకడంతో పండగ సీజన్లో ఏమీ కొనలేని పరిస్ధితి నెలకొందని సామాన్యులు వాపోతున్నారు. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డుస్ధాయికి చేరడంతో సరుకు రవాణా వ్యయం పెరిగి ఇతర వస్తువుల ధరల మంటకూ దారితీస్తోంది.