Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో తిరుగులేకుండా 15 ఏళ్లపాటు సాగిన మమతా బెనర్జీ పాలనకు తెరపడింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మమత ఆధ్వర్యంలోని టీఎంసీ ప్రభుత్వం ఓటమి దిశగా సాగుతోంది. బీజేపీ అధికారం దక్కించుకునేందుకు సిద్ధంగా ఉంది. పూర్తి ఫలితాలు వెల్లడించడమే ఆలస్యం. అయితే, 15 ఏళ్లపాటు సాగిన మమతా బెనర్జీ పాలనను దెబ్బకొట్టి, పార్టీని ఓడించిన అంశాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. విశ్లేషకుల అంచనా ప్రకారం టీఎంసీ ఓటమికి మొదటి కారణం ఆర్జీ కర్ హత్యాచార ఘటన.
ఈ ఘటన విషయంలో మమతా బెనర్జీ, ఆమె పార్టీ వ్యవహరించిన తీరుపై చాలా మందికి వ్యతిరేకత ఉంది. ఘటనలో బాధితురాలి తప్పే ఉందన్నట్లు ఆమె వ్యవహరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంలో సరిగ్గా వ్యవహరించలేదు. దీంతో మహిళలు, యువత మమతపై ఆగ్రహంతో ఉన్నారు. ఇదే సమయంలో బాధితురాలి తల్లికి బీజేపీ అసెంబ్లీ సీటు ఇచ్చి మరీ పోటీ చేయించింది. ప్రస్తుతానికి ఆమె విజయం దిశగా సాగుతోంది. హత్యాచార ఘటనలో మృతురాలి తల్లి పోటీ చేయడంతో సానుభూతి వ్యక్తమై బీజేపీకి మద్దతు పెరిగింది. జన్ జీ, జన్ ఎక్స్ యువత ఎక్కువగా బీజేపీకి అండగా నిలిచారు. టీఎంసీ సాగించిన గూండాయిజం, కార్యకర్తల దాడులు వంటి వాటితో ప్రజలు విసిగిపోయారు.
మరోవైపు మమత సన్నిహితులపై జరిపిన దాడుల్లో భారీగా అక్రమ నగదు పట్టుబడింది. ఇది కూడా మమత ఇమేజ్ మసకబారడానికి కారణాలు. ఇక ఈ ఎన్నికల్లో టీఎంసీ అనుసరించిన వ్యూహం మరో తప్పిదంగా చెప్పుకోవచ్చు. బీజేపీని బయటి పార్టీగా టీఎంసీ చెప్పుకొచ్చింది. కానీ, బీజేపీ మాత్రం మమత ప్రభుత్వం అవినీతి, అక్రమాల గురించి ప్రస్తావించింది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో టీఎంసీ విఫలమైందని ఆరోపించింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారుల్ని అడ్డుకోవడంలోనూ టీఎంసీ విఫలమైందని బీజేపీ విమర్శించింది. ఇక, ఇటీవల కేంద్రం నిర్వహించిన సర్ అంశంలో ఓట్ల తొలగింపు కూడా ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.