బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్లో తిరుగుబాటు సంకేతాలు కనిపిస్తున్నాయి. (revolt in Karnataka Congress) లోక్సభ టికెట్ల కేటాయింపుపై కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని కుటుంబాల వారికి టికెట్లు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా యోచనలో ఉన్నారు. ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప బంధువుకు కోలార్ లోక్సభ నియోజకవర్గం టికెట్ కేటాయించడంపై కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి వ్యక్తమైంది. ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఎంసీ సుధాకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. మునియప్ప కుటుంబానికి బానిసలు కాలేమని కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెప్పారన్నారు.
కాగా, పార్టీలోని ఇతరులకు అవకాశం ఇవ్వాలని తాము కోరుతున్నామని మంత్రి సుధాకర్ తెలిపారు. ఈ విషయంపై సీఎం సిద్ధరామయ్యతో మాట్లాడుతామని చెప్పారు. మునియప్ప పనితీరు వల్ల గతంలో తాము కష్టాలు ఎదుర్కొన్నామని అన్నారు. నియోజకవర్గంలో షెడ్యూల్డ్ కులాలకు ప్రాతినిధ్యం లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుటుంబం నుంచి కాకుండా మరొకరిని అభ్యర్థిగా కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.
మరోవైపు మునియప్ప కుటుంబానికి టికెట్ కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఐదుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ను కలిసి రాజీనామాలు సమర్పిస్తామంటూ పార్టీ హైకమాండ్ను బెదిరించారు. పార్టీ అధిష్టానం తమ అభిప్రాయాలను విన్నప్పటికీ తమ డిమాండ్లను పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు.