హిస్సార్ : చదువుకునే సమయంలో లస్సీ తాగినందుకు చెల్లించాల్సిన 28 రూపాయలను 67 సంవత్సరాల తర్వాత చెల్లించాడు ఓ రిటైర్డ్ నేవీ అధికారి. ఈ డబ్బులను చెల్లించేందుకు ఆయన అమెరికా నుంచి హర్యానాలోని హిసార్ చేరుకున్నారు శౌర్య పురస్కారం పొందిన రిటైర్డ్ నేవల్ కమాండర్ బీఎస్ ఉప్పల్. మోతీబజార్ వద్ద ఉన్న ఢిల్లీ వాలా హల్వాయి సమీపంలో ఉన్న దుకాణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దుకాణ దారుడు వినయ్ బన్సల్తో మాట్లాడుతూ.. 1954లో శంభు దయాళ్ బన్సల్ (వినయ్ బన్సల్ తాత)కు రూ.28 ఇవ్వాల్సి ఉందని, ఉన్నఫళంగా నగరాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చిందని, దీంతో మీ తాతకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేకపోయానంటూ తెలిపాడు.
ఆ తర్వాత నేవీలో చేరానని, అప్పుడు హిసార్కు రాలేకపోయానన్నారు. పదవీ విరమణ అనంతరం కొడుకుతో కలిసి అమెరికాకు వెళ్లానన్నారు. అయితే, అక్కడ తనకు హిసార్కు సంబంధించిన రెండు విషయాలు ఎప్పుడూ గుర్తుకు వస్తుండేవని.. ఒకటి శంభు దయాళ్ బన్సల్కు ఇవ్వాల్సిన రూ.28, పదో తరగతి పాసైన అనంతరం హర్జిరామ్ హిందూ హైస్కూల్కు చేరాలనుకున్నా.. చేరలేకపోయానంటూ పేర్కొన్నారు. ‘మీ దుకాణంలో చేసిన లస్సీని తాగేవాడిని. రూ.28 చెల్లించాల్సి ఉన్నది. మీ రుణాన్ని తీరుకోవడంతో పాటు నేను చదివిన విద్యాసంస్థను చూసేందుకు హిసార్కు ప్రత్యేకంగా వచ్చాను’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీఎస్ ఉప్పల్ రూ.10వేలు వినయ్ బన్సల్కు అందించగా.. ఆ డబ్బును తీసుకునేందుకు నిరాకరించాడు.
అయితే, మీకు బాకీ ఉన్నానని, దయ చేసి ఆ రుణాన్ని తీర్చుకునేందుకు అంగీకరించాలని, ఇందు కోసమే 85 సంవత్సరాల వయసులో అమెరికా నుంచి వచ్చానంటూ వినయ్ బన్సల్ను కోరగా.. చివరకు ఆ మొత్తాన్ని కాదనలేక స్వీకరించారు. అనంతరం బీఎస్ ఉప్పల్ హర్జిరామ్ స్కూల్కు వెళ్లారు. మూతపడిన పాఠశాలలను చూసి నిరాశతో వెనుదిరిగారు. బీఎస్ ఉప్పల్ ఇండో-పాక్ యుద్ధ సమయంలో పాక్ ఓడను నీటముంచిన జలాంతర్గామికి కమాండర్. ఆ యుద్ధంలో జలాంతర్గామితో సహా నేవీ సిబ్బందిని ఆయన సురక్షితంగా తీసుకువచ్చారు. దీంతో ఆయన ధైర్యసాహసాలను మెంచిన భారత ప్రభుత్వం శౌర్య పతకంతో సత్కరించింది.