Delhi | కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ అప్రమత్తమైంది. ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్న కేజ్రీవాల్ సర్కార్… తాజాగా మరో సంచలన నిర్ణయం కూడా తీసుకోనుంది. ఇకపై రెస్టారెంట్లు, హోటల్స్లో కూర్చొని డిన్నర్ చేయకుండా కఠిన ఆంక్షలు విధించనున్నట్లు సమాచారం. అయితే అవసరమైన వారికి వారి ఇళ్లకే పార్శల్స్ తెప్పించుకునే విధానాన్ని అమలులోకి తీసుకువచ్చే ఛాన్స్ ఉంది. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలోనే ఢిల్లీ విపత్తుల నిర్వహణ శాఖ సోమవారం కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలోనే పై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రజలు ఒకే చోట గుంపులు గుంపులుగా ఉంటే కరోనా వ్యాప్తి మరింత వేగంగా జరిగే అవకాశాలున్నాయని ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ సర్కార్ హోటల్స్లో కూర్చొని తినడంపై ఆంక్షలు విధించడానికి సిద్ధమైపోయింది.
కేవలం 24 గంటల్లోనే ఢిల్లీలో 22 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 17 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాజధానిలో 60 వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొంటున్నారు. ఇక 300 మందికి పైగా కరోనా రోగులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
ఢిల్లీలో లాక్డౌన్ విధించడం తమ ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదివారం స్పష్టం చేశారు. లాక్డౌన్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అయితే మాస్క్ మాత్రం కచ్చితంగా ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ మాస్క్ కచ్చితంగా ధరిస్తే, లాక్డౌన్ విధించాల్సిన అవసరమే లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అయితే ప్రజలందరూ కరోనా నిబంధనలను విధిగా పాటించాలని, అలా కాని పక్షంలో మాత్రం కచ్చితంగా లాక్డౌన్ విధిస్తామని సీఎం కేజ్రీవాల్ తేల్చి చెప్పారు.