కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం.. గెజిట్ జారీ
హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), కేంద్ర పోలీసు, సాయుధ బలగాల నియామకాల్లో దివ్యాంగులకు ఉన్న 4% రిజర్వేషన్లను కేంద్రం ఎత్తివేసింది. దివ్యాంగుల విభాగం చీఫ్ కమిషనర్తో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకొన్నట్టు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఐపీఎస్, కేంద్రపాలిత ప్రాంతాల్లోని(యూటీ) అన్ని పోలీస్ సర్వీసులు, ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, కేంద్ర సాయుధ బలగాల్లో దివ్యాంగుల రిజర్వేషన్ను ఎత్తివేస్తున్నట్టు అందులో తెలిపింది. దివ్యాంగుల హక్కుల చట్టం-2016లోని సెక్షన్ 34 ప్రకారం ప్రభుత్వ సంస్థల్లోని ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4శాతానికి తగ్గకుండా రిజర్వేషన్లు కల్పించాలి. అయితే పని స్వభావాన్ని బట్టి దివ్యాంగులను మినహాయించాల్సి వస్తే దివ్యాంగుల చీఫ్ కమిషనర్ లేదా రాష్ట్ర కమిషనర్ను సంప్రదించాలి.
నోటిఫికేషన్ను రద్దుచేయాలి
దివ్యాంగుల ఉద్యోగ హక్కులను హరిస్తున్న తాజా నోటిఫికేషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని అఖిల భారత దివ్యాంగుల హకుల వేదిక జాతీయ అధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. దివ్యాంగుల హక్కుల చట్టానికి విరుద్ధంగా కేంద్రం ఏకపక్షంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని రద్దు చేయకపోతే దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.