న్యూఢిల్లీ : ఈ ఏడాది నుంచి జనవరి 23 నుంచే గణతంత్ర వేడుకలు ప్రారంభం కానున్నాయి. జవనరి 24న సుభాష్ చంద్రబోస్ జయంతి పురస్కరించుకొని ముందుగానే గణతంత్ర వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఈ మాదిరిగానే గణతంత్ర వేడుకలను నిర్వహించనున్నారు.
భారత చరిత్ర, సంస్కృతికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను స్మరించుకోవడంపై ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ్ దివాస్గా జరుపుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆగస్టు 14న దేశ విభజన సంస్మరణ దినోత్సవంగానూ, అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యత దివాస్గా ప్రభుత్వం నిర్వహిస్తోంది.
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలో 26న జరిగే గణతంత్ర వేడుకలకు కేవలం 24 వేల మందికి అనుమతి ఇవ్వనున్నట్లు కేంద్రం వెల్లడించింది. కరోనాకు ముందు 2020లో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో దాదాపు లక్షా 25 వేల మంది పాల్గొన్నారు. గతేడాది కొవిడ్ నిబంధనల మధ్య 25 వేల మందిని అనుమతించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.