న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: నూతన విద్యా విధానంలో ప్రతిపాదించిన మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ (ఎంఈఎంఈ) వ్యవస్థను అమలు చేయడంలో భారతీయ విద్యా సంస్థలకు అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. జనాభా అధికంగా ఉండటం, ఉన్నత విద్యలో చేరేవారి సంఖ్య పెరుగుతుండటం ఇందుకు కారణమని తెలిపింది.
ఈ సమస్య గురించి, అది మన ముందుకొచ్చినప్పుడు ఎలా పరిష్కరించాలన్న దాని గురించి మన విద్యా సంస్థలు స్పష్టమైన ఆలోచన చేయలేదని పేర్కొన్నది. భారతీయ విద్యా సంస్థల్లో ఎంఈఎంఈని అనుమతిస్తే మధ్యలో ఎంతమంది విద్యార్థులు నిష్క్రమిస్తారు? ఎంతమంది చేరుతారు? అనే విషయాలను అంచనా వేయడం చాలా కష్టమవుతుందని, ఇది విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తికి భంగం కలిగించడం తథ్యమని వివరించింది.