న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులోని చీతాలకు రేడియో కాలర్లు తొలగించినట్టు అధికారులు సోమవారం వెల్లడించారు. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన పశు వైద్యులు, నిపుణులు చీతాలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారని అధికారులు చెప్పారు. చీతాల కదలికలను పసిగట్టేందుకు వాటి మెడకు రేడియో కాలర్లను కునో జాతీయ పార్కు అధికారులు అమర్చారు. రేడియో కాలర్ వల్లే చీతాలు ప్రాణాలు కోల్పోతున్నాయని వార్తలొచ్చాయి. ‘ప్రస్తుతం ఆరు మగ, ఐదు ఆడ చీతాలు ఎన్క్లోజర్లలో ఉన్నాయి.
వైద్య పరీక్షల అనంతరం వాటిలో ఆరింటి రేడియో కాలర్లు తొలగించాం’ అని అధికారులు చెప్పారు. ‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి 20 చీతాలను తీసుకురాగా..ఇప్పటివరకు 8 చీతాలు మృతిచెందిన విషయం తెలిసిందే. వాతారణ పరిస్థితుల కారణంగా అవి మృత్యువాత పడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో వైద్య పరీక్షలు నిర్వహించాక చీతాలను ఎన్క్లోజర్స్ నుంచి వదిలిపెడతారని తెలిసింది. ఇకపై రేడియో కాలర్లకు బదులు డ్రోన్లను వాడతారని తెలిసింది.