Nawab Malik | మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నవాబ్ మాలిక్కు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఈ కేసులో మధ్యంతర బెయిల్ను కోర్టు మరో ఆరు నెలలు పొడిగించింది. ఈడీ తరఫున కోర్టుకు హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు బెయిల్పై ఎలాంటి అభ్యంతరం తెలుపకపోవడంతో జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్ ధర్మాసనం బెయిల్ను పొడిగించింది. ఇంతకు ముందు ఆయనకు ఆరోగ్య సమస్యల నేపథ్యంలో వైద్యం చేయించుకునేందుకు కోర్టు మధ్యంతర బెయిల్ను ఇచ్చింది.
ఇంతకు ముందు అక్టోబర్ 12న సైతం మూడు నెలలు పొడిగించింది. మనీలాండరింగ్ కేసులో వైద్యం చేయించుకునేందుకు బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. గతేడాది జులై 13న బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ‘సుప్రీం’ను ఆశ్రయించారు. మాలిక్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నానని.. వైద్యం చేయించుకునేందుకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీంతో కోర్టు గతేడాది ఆగస్టు 11న రెండు నెలల పాటు బెయిల్ను మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. భారత్ మోస్ట్ వాటెండ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుల కార్యకలాపాలకు సంబంధించిన కేసులో ఈడీ 2022 ఫిబ్రవరిలో నవాబ్ మాలిక్ను అరెస్టు చేసింది.