న్యూఢిల్లీ/రాంచీ, నవంబర్ 7: మైనింగ్ లీజు వ్యవహారంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్కు సుప్రీంకోర్టు సోమవారం ఊరట కల్పించింది. జూన్ 3న జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. మైనింగ్ ఆరోపణల కేసులో జార్ఖండ్ హైకోర్టులో దాఖలైన పిల్స్ విచారణ యోగ్యమైనవి కావని పేర్కొన్నది. సొరేన్ తనకు తానే మైనింగ్ లీజు కేటాయించుకొన్నారన్న ఆరోపణలపై విచారణ జరుపాలని కోరుతూ జార్ఖండ్ హైకోర్టులో గతంలో పిల్స్ దాఖలయ్యాయి. వీటిని విచారణయోగ్య వ్యాజ్యాలుగా హైకోర్టు తీర్పునివ్వడాన్ని సవాల్ చేస్తూ సొరేన్, జార్ఖండ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ లలిత్, ఎస్ఆర్ భట్, సుధాంశు ధులియా ధర్మాసనం ఆగస్టు 17న తీర్పును వాయిదా వేసింది. అంతకుముందు పిల్స్పై విచారణలో ముందుకు పోవద్దని హైకోర్టుకు సూచించింది. కాగా, సుప్రీంకోర్టు తీర్పుపై సీఎం హేమంత్ సొరేన్ సంతోషం వ్యక్తం చేశారు. ‘సత్యమేయ జయతే’ అని ట్వీట్ చేశారు. ఈ తీర్పు ప్రజల కోసం పనిచేయాలనే తన సంకల్పానికి బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్రపతికి యూపీఏ లేఖ
జార్ఖండ్లోని తమ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నదని, దీన్ని అడ్డుకొనేందుకు జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ముర్మును యూపీఏ కోరింది. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ఎమ్మెల్యేల్లో చీలిక తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నది. గత ఆరు నెలలుగా దర్యాప్తు సంస్థ తీరును గమనిస్తే, తమ నేతలను వేధించడమే పనిగా పెట్టుకున్నట్టు అనిపిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేసింది.