ముంబై: ఇటీవల ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై రిలయన్స్ ఫౌండేషన్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బాలాసోర్ రైలు ప్రమాదంలో తమ ఆప్తులను కోల్పోయిన వారికి రిలయన్స్ ఫౌండేషన్ తరఫున ఆ సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ నీతా అంబానీ సంతాపం తెలియజేశారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే రిలయన్స్ ఫౌండేషన్ స్పెషలైజ్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ రెస్క్యూ ఆపరేషన్లో తన సహాయ, సహకారాలు అందించిందని అమె తెలిపారు.
తీవ్రంగా గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి తమ స్పెషలైజ్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ ఇప్పటికీ సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నదని నీతా అంబానీ చెప్పారు. ప్రమాదంలో సర్వం కోల్పోయిన వారి జీవితాలను తిరిగి యథాస్థితికి తీసుకురాలేమని, కానీ వారు తమ జీవితాలను పునర్నిర్మించుకునే వరకు రిలయన్స్ ఫౌండేషన్ బాధితులకు అండగా నిలుస్తుందని ఆమె తెలిపారు. అందుకోసం రిలయన్స్ ఫౌండేషన్ 10 పాయింట్ రిలీఫ్ మెజర్స్ ప్రోగ్రామ్ను ప్రకటించింది.
10-పాయింట్ రిలీఫ్ మెజర్స్
1. ప్రమాద బాధితుల సహాయార్థం వినియోగిస్తున్న అంబులెన్స్లకు Jio-BP నెట్వర్క్ ద్వారా ఉచితంగా ఇంధనం అందజేయండం.
2. ప్రమాదంతో ప్రభావితమైన కుటుంబాలకు ఆరు నెలలపాటు రిలయన్స్ స్టోర్ల నుంచి ఉచితంగా బియ్యం, పప్పులు, చక్కెర, పిండి, ఉప్పు, వంటనూనె ఇవ్వడం.
3. ప్రమాదంలో గాయపడిన వారికి ఉచితంగా చికిత్స చేయించడం, మెడిసిన్ ఇప్పించడం.
4. ప్రమాదంవల్ల కలిగిన భావోద్వేగపరమైన, మానసికపరమైన సమస్యల పరిష్కారానికి కౌన్సెలింగ్ చేయించడం.
5. అవసరమైతే ప్రమాదంలో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి జియో ద్వారా, రిలయన్స్ ద్వారా ఉద్యోగ అవకాశం కల్పించడం.
6. ప్రమాదంలో అంగవైకల్యం చెందిన వారికి వీల్చైర్లు, ఆర్టిఫిషియల్ లింబ్స్ లాంటి అవసరమైన పనిముట్లు అందించడం.
7. ప్రమాదంలో ప్రభావితమైన వారికి నూతన ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం ప్రత్యేక నైపుణ్య శిక్షణ అందజేయడం.
8. సంపాదించే వ్యక్తిని కోల్పోయిన కుటుంబాల్లోని మహిళలకు ఉపాధి శిక్షణ ఇప్పించడం.
9. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు బతుకుదెరువు కోసం ఆవు, బర్రె, మేక, పౌల్ట్రీ లాంటి ప్రత్యమ్నాయాలను సమకూర్చడం.
10. బాధిత కుటుంబసభ్యుల్లో ఒకరికి తమ జీవితాలను మెరుగుపర్చుకోవడం కోసం ఏడాదిపాటు ఉచితంగా మొబైల్ కనెక్టివిటీ సదుపాయం కల్పించడం.