శ్రీనగర్ : జైషే మహమ్మద్ ( Jaish e Mohammed ) ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది అబూ సైఫుల్లా ( Abu Saifullah ) ఇవాళ జమ్మూకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అబూ సైఫుల్లాను లంబూగా పిలుస్తారు. ఇతనిది పాకిస్థాన్లో పంజాబ్ రాష్ట్రం. 2019లో జరిగిన పుల్వామా దాడిలో ఇతను ప్రధాన నిందితుడు. ఆ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ దాడిలో వాడిన ఐఈడీ పేలుడు పదార్ధాన్ని ఇతనే తయారు చేసినట్లు తెలుస్తోంది. దక్షిణ కశ్మీర్లో జైషే సంస్థ ఆపరేషనల్ కమాండర్గా చేశాడతను. ఎన్క్రిప్ట్ మెసేజింగ్ అప్లికేషన్స్లో సైఫుల్లా నిపుణుడు. ఐఈడీ తయారీలోనూ నిష్ణాతుడు. అవంతిపురా నుంచి అతను తన ఆపరేషన్స్ హ్యాండిల్ చేసేవాడు. సైఫుల్లాను అద్నన్ అని కూడా పిలుస్తారని తెలుస్తోంది. జైషే ఉగ్ర సంస్థ వ్యస్థాపకుడు మౌలానా మసూద్ అజర్కు దగ్గరి బంధువు అని తెలుస్తోంది. 2017లో అతను ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించాడు. అప్పటి నుంచి ఇక్కడే ఉగ్ర కార్యకలాపాలను ఆపరేట్ చేస్తున్నాడు.