న్యూఢిల్లీ: సమాజంలో వివాహానికి ద్వంద్వ లింగ వ్యక్తులు మాత్రమే అవసరమా? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ మూడోరోజూ కొనసాగింది. స్వలింగానికి చెందిన ఇద్దరు భాగస్వాములు కలిసుండటానికి వివాహం అవసరమా? అని సీజేఐ చండ్రచూడ్ ప్రశ్నించారు. ‘స్వలింగ సంబంధాలు శారీరకమైనవే కాదు. అంతకు మించి దృఢమైనవి. భావోద్వేగాలకు చెందినవి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటే వివాహంపై అభివృద్ధి చెందుతున్న భావనను పునర్నిర్వర్తించాల్సి ఉన్నది. విభిన్న లింగానికి చెందిన ఇద్దరు వ్యక్తులే వివాహానికి అవసరమా? అన్న విషయాన్ని పరిశీలించాలి. స్వలింగ సంపర్కం చట్టప్రకారం నేరం కాదని గతంలో తాము తీర్పు ఇచ్చామంటే కేవలం ఇద్దరు వ్యక్తులు శారీరకంగా కలుసుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చినట్టు కాదని, వారు సమాజంలో పటిష్టమైన బంధాల కొనసాగింపునకు ఇచ్చిన గుర్తింపు కూడా అని వ్యాఖ్యానించారు. వివాహం ద్వారా సంక్రమించే హక్కులన్నీ కావాలని స్వలింగ దంపతులు సైతం కోరుకుంటున్నాని సీజేఐ అన్నారు.