ప్రతిపక్ష రాష్ర్టాలపై కక్ష
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న తమిళనాడు, కేరళ తదితర రాష్ర్టాలపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. గవర్నర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టిస్తున్నది. ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర ప్రమాదకరం.
– రాజు రామచంద్రన్, సీనియర్ న్యాయవాది
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం క్షీణించిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీ గోపాల్ గౌడ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వ చర్యలతో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రమాదంలో పడ్డాయని, రైట్ వింగ్ శక్తుల కారణంగా ప్రజాస్వామ్య భారతం.. హిందూ-ఫాసిస్టు దేశంగా మారుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలోని రాజకీయాలను చూస్తే, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ ఏర్పడిన తొలినాళ్ల పరిస్థితులు గుర్తొస్తున్నాయన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతీఒక్కరూ కదిలిరావాలని ‘సేవ్ కాన్స్టిట్యూషన్-సేవ్ డెమొక్రసీ’ పేరిట ఢిల్లీలో ఏర్పాటు చేసిన సదస్సులో వక్తలు పిలుపునిచ్చారు. హైకోర్టు మాజీ జడ్జీ జస్టిస్ రేఖా శర్మ, డీయూజే ప్రధాన కార్యదర్శి సుజాత మధుక్, రాజ్యసభ ఎంపీ, ఏఐఎల్యూ ప్రెసిడెంట్ వికాస్ భట్టాచార్య, ఏఐఎల్యూ ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది పీవీ సురేంద్రనాథ్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు.
ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం
బీజేపీ పాలనలో దేశంలో ప్రస్తుతం మైనారిటీలు భయంభయంగా బతుకీడుస్తున్నారు. స్వేచ్ఛ, పారదర్శక వాతావరణంలో ఎన్నికలు జరుగడం లేదు. కాగ్, ఎన్నికల సంఘం వంటి స్వయంప్రతిపత్తి సంస్థలు కేంద్రప్రభుత్వం ఆడించినట్టు ఆడుతున్నాయి. ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొన్న నిర్ణయాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. రాష్ర్టాలు, ప్రజలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నారో, లేదో చూడకుండా లాక్డౌన్ విధించారు. ఎన్నో చిన్న పరిశ్రమలు మూతబడ్డాయి. ఇప్పటికీ, అవి కోలుకోలేకపోయాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. కరోనా సంక్షోభంలో ఎంతోమంది దారిద్య్రరేఖ దిగువకు జారిపోయారు. ఇదే సమయంలో వందలాది మంది బిలియనీర్లు కొత్తగా పుట్టుకొచ్చారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్నార్సీ వంటివి లౌకిక, గణతంత్ర దేశానికి విఘాతంగా మారాయి. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిని కేంద్రం దుర్వినియోగం చేస్తున్నది. – జస్టిస్ గోపాల గౌడ
ఇప్పటికీ స్వేచ్ఛ రాలేదు
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినప్పటికీ మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామా? ఇది ప్రశ్నించుకోవాలి. ఈ పరిస్థితి దురదృష్టకరం.
– హైకోర్టు మాజీ జడ్జీ జస్టిస్ యూబీ షా
రాజ్యాంగంపై రెండు దాడులు
భారత రాజ్యాంగంపై ఎమర్జెన్సీ టైమ్లో ఒకదాడి జరిగితే, 2014లో మరొకటి మొదలైంది.
– ఇందిరా జైసింగ్, సీనియర్ న్యాయవాది
జర్నలిస్టుల అణచివేత
బీజేపీ ప్రభుత్వహయాంలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయి. గౌరీ లంకేశ్ హత్య, సిద్ధిఖీ కప్పాన్ అరెస్టే వీటికి సాక్ష్యం. – డీయూజే ప్రెసిడెంట్, సీనియర్ జర్నలిస్ట్ ఎస్కే పాండే