Assam | దిస్పూర్, సెప్టెంబర్ 7: ‘రోమ్ నగరం తగలబడుతుంటే.. ఫిడేలు వాయించిన చక్రవర్తి’లాగా ఉంది.. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తీరు. కరెంటు కోతలతో రాష్ట్ర ప్రజలు నానా అవస్థలు పడుతుంటే.. రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికొదిలేసిన ఆయన.. గిన్నిస్ రికార్డుల కోసం ఆరాటపడుతున్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర ప్రజల కనీస అవసరాలు తీర్చలేని హిమంత బిశ్వ శర్మ.. తన బాధ్యతల నుంచి తప్పుకొని చేతులెత్తేశారు. కరెంటు కోతలను భరించక తప్పదని, లేదంటే చార్జీలు పెంచాల్సి ఉంటుందని బహిరంగంగా ప్రకటించి తన అసమర్థతను చాటుకున్నారు.
కోతలతో సతమతం
కొన్ని నెలలుగా అస్సాంలో కరెంటు కష్టాలు ఎక్కువయ్యాయి. నిత్యం విద్యుత్తు కోతలతో ఆ రాష్ట్ర ప్రజలు అవస్థలు పడుతున్నారు. సమస్యను పరిష్కరించకుండా తప్పించుకొంటున్న రాష్ట్ర ప్రభుత్వం భారీగా కరెంటు చార్జీలు పెంచింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రే కరెంటు చార్జీలను భరించక తప్పదని బహిరంగంగా ప్రకటించారు. ‘రాష్ట్ర అవసరాలకు సరిపడా కరెంటు ఉత్పత్తి కావడం లేదు. భారీ లోటు ఉంది. కరెంటు కోతలను భరించక తప్పదు. రోజూకు 5-10 గంటల కోత విధించాల్సి ఉంటుంది. కోతలు వద్దు అనుకుంటే.. చార్జీల పెంపు తప్పదు. గతంలో 1800 మెగావాట్ల కరెంటు సరిపోయేది. ఈ డిమాండ్ ప్రస్తుతం 2500 మెగావాట్లకు చేరుకుంది. డిమాండ్కు తగ్గట్టుగా సైప్లె చేయాలంటే ప్రైవేటు కంపెనీలతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కూడా టారిఫ్ పెంచక తప్పదు’ అని వ్యాఖ్యానించారు. అయితే ఇది వరకే కరెంటు చార్జీలను అస్సాం ప్రభుత్వం పెంచింది. అయినప్పటికీ రాష్ట్ర సీఎం చెప్పినట్టు చార్జీలను భరించినప్పటికీ కోతలు ఆగడం లేదంటూ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర స్పీకర్ బిశ్వజిత్ దైమరీ సైతం ఈ ఏడాది జూలైలో కరెంటు కోతలపై ప్రజలకు ఉచిత సలహాలు ఇచ్చి అభాసుపాలయ్యారు. ‘రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. కరెంటు చార్జీలు పెంచక తప్పదు. కరెంటు చార్జీల భారం నుంచి తప్పించుకోవాలనుకుంటే చెట్ల కింద కూర్చోండి. ఫ్యాన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వాడొద్దు’ అని స్పీకర్ ఉచిత సలహాలు ఇచ్చారు.
ప్రజా సమస్యలు గాలికొదిలేసి..
రాష్ట్ర ప్రజలు కరెంటు కష్టాలతో అల్లాడుతుంటే.. సీఎం మాత్రం గిన్నిస్ రికార్డుల కోసం ఆరాటపడుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 9-17 వరకు 9 గిన్నిస్ రికార్డులే లక్ష్యంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు సాక్షాత్తూ సీఎం హిమంత పేర్కొనడం గమనార్హం. మరోవైపు పుస్తకావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటూ తనకు ప్రజల సమస్యల పరిష్కరించడంలో చిత్తశుద్ధి లేదని ఆయన నిరూపించుకున్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఇతర కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతున్న సీఎం తీరుపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.