న్యూఢిల్లీ, జూన్ 17: ఎన్నికల వేళ ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో నిలబడే అభ్యర్థులను పోటీకి అనర్హులుగా ప్రకటించాలని, లేకపోతే భారీ జరిమానా విధించాలని, ఇందుకోసం ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ చేయాలని ఎన్నికల సంఘం కేంద్రప్రభుత్వానికి సూచించింది. అభ్యర్థులు రెండు చోట్ల పోటీ చేయడం, రెండు స్థానాల్లోనూ గెలిస్తే ఒక చోట రాజీనామా చేయడం, ఖాళీ అయిన స్థానానికి మళ్లీ ఉప ఎన్నిక నిర్వహించడం.. ఇదంతా ఎన్నికల సంఘానికి తలనొప్పి వ్యవహారంగా మారింది. పైగా ప్రజాధనం ఖర్చు. సమయం వృథా. ఈ నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ లెజిస్లేటివ్ సెక్రెటరీతో మాట్లాడారు. అభ్యర్థులు రెండు స్థానాల్లో పోటీ చేయకుండా నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రెండు దశాబ్దాల క్రితం కూడా ఇదే ప్రతిపాదన వచ్చింది. ‘రెండు స్థానాల నుంచి పోటీ చేసి గెలిచిన అభ్యర్థి తాను వదులుకొన్న స్థానంలో ఉప ఎన్నికకు అయ్యే ఖర్చును భరించాలి. లేదా అసెంబ్లీ స్థానానికి రూ.5 లక్షలు, ఎంపీ స్థానానికి రూ.10 లక్షలు జరిమానా చెల్లించాలి’ అని అప్పుడు ప్రతిపాదించారు. అయితే, ఇది అమల్లోకి రాలేదు. చట్ట సవరణ చేస్తే ఈ జరిమానా మొత్తాన్ని భారీగా పెంచాలని ఎన్నికల సంఘం తాజాగా సూచించింది.