న్యూఢిల్లీ, జూలై 6: వంద లోపు ఉన్న వంటనూనె ధరలు డబుల్ సెంచరీ దాటేదాకా చోద్యం చూస్తూ కూర్చుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు తీరిగ్గా కాస్త ధర తగ్గించాలంటూ తయారీసంస్థలను కోరింది. అంతర్జాతీయ ధరల పతనం నేపథ్యంలో దిగుమతి చేసుకున్న వంటనూనెల ఎంఆర్పీ ధరలను వారంలోగా లీటర్కు రూ.10 తగ్గించాలని సూచించింది. అదేవిధంగా ఒకే బ్రాండ్ నూనెలపై ఒకేవిధమైన ఎంఆర్పీ ఉండేలా చూడాలని పేర్కొన్నది. అంతర్జాతీయ ధరలు తగ్గిన నేపథ్యంలో ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుదాన్షు పాండే వంటనూనె తయారీదారుల అసోసియేషన్లతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులు, ఎంఆర్పీ తగ్గింపు చర్చలు జరిపారు.
గతవారం వ్యవధిలో అంతర్జాతీయంగా ధరలు 10 శాతం వరకు తగ్గాయని, తదనుగుణంగా ఎంఆర్పీలను తగ్గించాలని కోరినట్టు పాండే పేర్కొన్నారు. దీనికి వారంలో పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్స్పై రూ.10 వరకూ తగ్గిస్తామని మెజార్టీ తయారీదారులు హమీ ఇచ్చారని తెలిపారు. వంటనూనె అవసరాల్లో 60 శాతానికి పైగా మన దేశం దిగుమతి చేసుకుంటున్నది. ప్రపంచ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో నూనెల ధరలు గత కొన్ని నెలలుగా ఒత్తిడికి గురవుతున్నాయి. అనంతర పరిణామాలతో అంతర్జాతీయ ధరలు తగ్గుతూ వచ్చాయి. వంటనూనెల తయారీదారులు గతనెలలో లీటర్కు రూ.10-15 తగ్గించాయి.