న్యూఢిల్లీ: భద్రతా కారణాలు, కరోనా పరిస్థితుల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్ర కోటను ఆగస్ట్ 15 వరకు మూసివేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉగ్రవాదులు దాడి చేయవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. భద్రతా కారణాలతో పాటు కరోని పరిస్థితుల నేపథ్యంలో ఆగస్ట్ 15 వరకు ఎర్ర కోటను మూసివేయాలని కోరుతూ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఢిల్లీ పోలీసులు ఈ నెల 12న లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, తమకున్న అధికారాల మేరకు ఈ నెల 21 నుంచి ఆగస్ట్ 15న జరిగే స్వాతంత్ర్య వజ్రోత్సవం ముగిసే వరకు ఎర్ర కోటలోకి సందర్శకులను అనుమతించబోమని బుధవారం తెలిపింది.
మరోవైపు జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి ఆగస్ట్ 5 నాటికి రెండేండ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో ఉగ్ర దాడి జరుగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. కాగా, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన చేస్తామని ఇటీవల ప్రకటించారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు హై అలెర్ట్ అయ్యారు. ఢిల్లీతోపాటు సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రి, ఘాజిపూర్ వద్ద భద్రతను పెంచారు. డ్రోన్ల దాడులను ఎదుర్కొనేందుకు భారత వాయు సేన, ఎన్ఎస్జీ, డీఆర్డీవో సహకారంతో 360 డిగ్రీల యంటీ డ్రోన్ వ్యవస్థలను ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నారు.