సిద్దిపేట/గజ్వేల్, ఏప్రిల్ 23: జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో సిద్దిపేట, గజ్వేల్ పట్టణాలు మార్మోగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్, శ్రీరాముడి విగ్రహాలతో మంగళవారం ఉదయం ప్రారంభమైన శోభాయాత్ర మధ్యాహ్నం వరకు కొనసాగింది. ఈ యాత్ర మహిళల మంగళహారతులతో చిన్నారులు, యువకుల కేరింతల మధ్య ఆద్యాంతం ఉత్సాహంగా జరిగింది. భక్తులు భారీ సంఖ్య లో పాల్గొని యాత్రను విజయవంతం చేశారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పులిహోర, మజ్జిగ, తాగునీరు, అన్నదానం చేశారు. శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
దేవుడి దయతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట, గజ్వేల్లో నిర్వహించిన శోభాయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ యాత్రలో హనుమాన్, రాముడి విగ్రహాలకు పూలమాల వేసి, ప్రత్యేక పూజలు చేశారు. సిద్దిపేటలోని రామరాజు రావిచెట్టు హనుమాన్ దేవాలయంలో మాలధారులతో కలిసి భిక్షలో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, భజరంగదళ్ కార్యకర్తలు, భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.