న్యూఢిల్లీ: ఆదివారం ఎడతెగని వర్షాలతో ఢిల్లీ, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ప్రమాద ఘటనల్లో కనీసం 19 మంది చనిపోయారు. ఢిల్లీలో గురుగ్రామ్ సహా అనేక ప్రాంతాల్లో రహదారులు, అండర్పాసుల్లో భారీ ఎత్తున నీరు చేరి వాహనాలు కొట్టుకుపోయాయి. 17 రైళ్లను రద్దు చేస్తున్నట్టు ఉత్తర రైల్వే జోన్ ప్రకటించింది. 40 ఏండ్ల తర్వాత ఢిల్లీలో ఆదివారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో రికార్డ్ స్థాయిలో 153 మిమీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.
ఉత్తరాఖండ్లో ఓ జీప్ గంగానదిలో కొట్టుకుపోవటంతో, అందులో ఉన్న ముగ్గురు యాత్రికులు చనిపోయారు. పూంచ్ జిల్లాలో ఇద్దరు జవాన్లు వరదనీటిలో కొట్టుకుపోయారు. హిమాచల్లో వందలాది మంది ప్రజలు నిరాశ్రయలయ్యారు. బియాస్ నది ఉగ్రరూపం దాల్చటంతో చండీగఢ్-మనాలీ జాతీయ రహదారి కొట్టుకుపోయింది. కోట్గఢ్లో ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడగా, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. హర్యానాలో మర్కంద, ఘాగర్, తంగ్రి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహి స్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఒక ఇంటిపై చెట్టు కూలిన ఘటనలో 10 ఏండ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తెహ్రి జిల్లా గులార్ వద్ద నదిలో పర్యాటకుల వాహనం బోల్తా పడి ఏపీకి చెందిన రవిరావు గల్లంతయ్యారు.