(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): జమిలి ఎన్నికల నిర్వహణపై సిఫారసులు, కమిటీల ఏర్పాటు ఈనాటిది కాదు. 1983లో నాటి ఎన్నికల సంఘం చట్టసభలకు ఒకేసారి ఎన్నికలు జరుపాలని ప్రతిపాదించింది. 1999లో లా కమిషన్ ఇదే సూచన చేసింది. 2015లో పార్లమెంటరీ కమిటీ జమిలి ఎన్నికలకు సానుకూలత వ్యక్తం చేసింది. జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి 2016 తర్వాత కూడా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, లా కమిషన్, నీతిఆయోగ్ పలు కమిటీలుగా ఏర్పడి ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’కు అనుకూలంగా నివేదికలు ఇచ్చాయి. ప్రస్తుతం కేంద్రం నిర్ణయించిన కోవింద్ కమిటీ నాలుగవది. కాగా, మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటుచేయడం ఇదే మొదటిసారని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జమిలి ఎన్నికల ప్రక్రియ ఇప్పటికిప్పుడు అమల్లోకి తీసుకురావడం కష్టసాధ్యమని, వివిధ రాష్ర్టాల అసెంబ్లీల కాలపరిమితిలో సర్దుబాట్లు (పొడగింపు లేదా కుదింపు) చేసి వచ్చే పదేండ్లలో పూర్తిస్థాయిలో తీసుకొచ్చే అవకాశమున్నదని చెబుతున్నారు.