న్యూఢిల్లీ : యూపీలోని రాయ్బరేలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే ఆదితి సింగ్ (34) బుధవారం సాయంత్రం బీజేపీలో చేరనున్నట్టు తెలిసింది. ఆదితి సింగ్ గత కొంతకాలంగా కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో విభేదిస్తున్నారు. ఆదితి తొలిసారిగా 2017లో యూపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆమె తండ్రి దివంగత అఖిలేష్ సింగ్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించారు. కాంగ్రెస్ కంచుకోటగా భావించే రాయ్బరేలి ఎమ్మెల్యే కాషాయ తీర్ధం తీసుకోనుండటం రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
కాంగ్రెస్ తరపున ఎన్నికైన ఆదితి సింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు పలకడంతో పాటు పలుమార్లు సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన క్రమంలో ప్రియాంక గాంధీ మోదీ సర్కార్పై చేసిన విమర్శలను ఆదితి సింగ్ తోసిపుచ్చారు. ఆర్టికల్ 370 రద్దు సహా పలు అంశాల్లో ఆమె బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలికారు.