భోపాల్, అక్టోబర్ 27: మధ్యప్రదేశ్లో వచ్చే నెల జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతతో ఇప్పటికే ఓటమి భయంలో ఉన్న బీజేపీకి మరో గట్టి దెబ్బ పడింది. బీజేపీపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన రాష్ట్ర మంత్రి నారాయణ్ త్రిపాఠి సొంత పార్టీని స్థాపించారు. వింధ్య రీజియన్ అభివృద్ధి, ప్రత్యేక రాష్ట్ర సాధన ఎజెండాతో పార్టీ పేరును ‘వింధ్య జనతా పార్టీ’గా ప్రకటించారు. అదేవిధంగా 25 మంది కూడిన అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను కూడా విడుదల చేశారు.
శుక్రవారం భోపాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో త్రిపాఠి మాట్లాడుతూ మొత్తం 40 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలబెడుతామని తెలిపారు. వింధ్య అభివృద్ధి గురించి మాట్లాడితే బీజేపీలో రెబల్స్గా ముద్ర వేస్తున్నారని విమర్శించారు. వింధ్య రీజియన్ ప్రజలు ఏండ్లుగా మోసపోతున్నారని, ఆ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదని అన్నారు. రాష్ట్రంలో గత 20 ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ.. వింధ్య రీజియన్ అభివృద్ధికి ఏ విధమైన నిర్ణయాలు తీసుకోలేదని దుయ్యబట్టారు. అనేక వనరులు ఉన్నప్పటికీ, ఉపాధి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వింధ్య ప్రదేశ్’ ఏర్పాటే తమ ప్రధాన లక్ష్యమని, అందుకోసమే ముందుకొచ్చామని త్రిపాఠి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.