శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 19 మందికి గాయాలయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం రియాసీ పట్టణంలోని అలియా ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తమ ప్రాథమిక విచారణంలో తేలిందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.