ఒమిక్రాన్ కరోనా వేరియంట్తో ఇబ్బందులు పడుతున్న ఆఫ్రికా దేశాలకు తాము అండగా ఉంటామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఒమిక్రాన్ (Omicron)తో పోరులో ఆ దేశాలకు అవసరమైన వ్యాక్సిన్లు, తదితర వస్తువులన్నింటినీ పంపుతామని చెప్పింది. భారత్లో తయారు చేసిన వ్యాక్సిన్లు, అవసరమైన మెడిసిన్స్ పంపుతామని భారత్ తెలిపింది. కరోనా టెస్ట్ కిట్లు, గ్లవ్స్, పీపీఈ కిట్లు, మెడికల్ ఎక్విప్మెంట్.. ఇలా ఆ దేశాలకు అవసరమైన సామగ్రి మొత్తం పంపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.
ఆ దేశాల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది. ఇప్పటికే బోత్సువానాకు కోవాగ్జిన్ వ్యాక్సిన్ సరఫరా చేశామని, ఈ దేశాలకు మరింత సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తమ సంసిద్ధతను బయటపెట్టింది. కాగా, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. దక్షిణాఫ్రికాలో బయటపడిన సంగతి తెలిసిందే. ఇది చాలా వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి.