నేరేడుచర్ల, మార్చి 3 : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు.. 420 హామీలను ఇంత వరకు సక్రమంగా అమలు చేయక మాయ మాటలు చెబుతోంది. మరోసారి గొప్పలకు పోయి ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. సీఎం హామీ ఇచ్చి మూడు నెలలైనా ఇంత వరకు అమలుకు నోచుకోలేదని సర్పంచులు విమరిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కొత్త సంవత్సరం కానుకగా చిన్న పంచాయతీలకు రూ. 5లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.10 లక్ష చొప్పన కోటా నుంచి విడుదల చేస్తామని గత డిసెంబర్లో ప్రకటించారు. ఇప్పటి వరకు నిధులు ఊసే లేకపోవడంతో సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ధిక సంఘం ద్వారా కేంద్రం నిధులు విడుదల చేసినా అవి అరకొరగానే ఉండటం, పంచాయతీల నిర్వహణకు నిధులు వినియోగించే వీలు లేకపోవడంతో సీఎం ఇచ్చే నిధులు కోసం సర్పంచ్లు నిరీక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదలవుతాయిని సర్పంచులు భావిస్తున్నారు. చెల్లించాల్సిన బిల్లులు పేరుకుపోవడం, పన్నుల ఆదాయం అంతంత మాత్రంగానే ఉండటంతో సీఎం కోటా నిధులతోనైనా ఊరట లభిస్తుందని ఆశిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నారు.
గ్రామపంచాయతీల అభివృద్ధికి సరిపోను నిధులు రాక గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయి. సర్పంచులుగా బాధ్యతలు స్వీకరించగానే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే తప్పన ఉంటుందని, కానీ అభివృద్ధికి తగిన నిధులు లేక పోవడంతో చేసేదేమీ లేక చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నామని సర్పంచులు వాపోతున్నారు. మరి కొంత మంది సర్పంచులు గ్రామాల్లోని సమస్యలను చూసి చలించి తమ సొంత నిధులతో కొన్ని పనులు చేపడుతున్నారు.
గత బీఆర్ఎస్ పాలనలో గ్రామాలు చాలా వరకు అభివృద్ధి చెందాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని నిత్యం కార్యక్రమాలు నిర్వహించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేవారు. కాని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రజల మనస్సు తెలిసిన నాయకుడని, తాము అడగక ముందే కావాల్సిన అవసరాలు తీర్చే వారని, అలాంటి నాయకుడిని ఓడించడం తమ దురదృష్టమని పలువురు బాహాటంగా చర్చించుకుటున్నారు.
పంచాయతీల పాలన ఇంకా గాడిలో పడలేదు. నిధులు లేక, బిల్లులు పెండింగ్లో ఉండటంతో ప్రభుత్వం ఇచ్చే నిధులు కోసం ఎదురుచూస్తున్నాం. ఆర్ధిక సంఘం నిధులతో ముడి పెట్టకుండానే నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. నిధులు విడుదలైతేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి.
పంచాయతీలను ప్రభుత్వం చులకనగా ఉండటం సరికాదు. ఎస్ఎఫ్సీ నిధులు లేవు. కనీసం సీఎం కోటా నిధులకైనా మోక్షం కలిగించాలి. నిధులు విడుదలైతేనే పంచాయతీలకు ఊరట. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అలాంటి పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలి.