బీబీనగర్, ఫిబ్రవరి 3 : కుటుంబ కలహాలు విషాదాంతానికి దారి తీశాయి. మండలంలోని గొల్లగూడెం గ్రామంలో ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులను చంపి అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన దారుణ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మేకల మహేష్ యాదవ్కు వలిగొండ మండలం వేములకొండకు చెందిన ఐశ్వర్య(28)తో 2020లో వివాహమైంది. వీరికి ఘాన్సి (3), పండు (10 నెలలు) వయస్సు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహమైన కొత్తలో బాగానే ఉన్నా గత కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
మహేష్ యాదవ్ ఐశ్వర్యను అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా, వివాహేతర సంబంధాలు కొనసాగించడమే ఈ ఘోరానికి కారణమని ఐశ్వర్య బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై తరచుగా గొడవలు జరుగుతుండటంతో గత పదినెలలుగా ఆమె భర్తకు దూరంగా పుట్టింట్లోనే ఉంటోంది. మహేష్ గత పది రోజులుగా ఫోన్లు చేస్తూ ఇంటికి రావాలని కలసి ఉందామని చెప్పడంతో సోమవారం ఐశ్వర్యను పెదనాన్న, పెద్దమ్మ భర్త ఇంటికి తీసుకొచ్చి వదిలి వెళ్లారు. అయితే అదే రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం అత్త లేచి చూడగా ఐశ్యర్య పిల్లలను చంపి, ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలకు పంచనామా చేపట్టి, భువనగిరి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తన భర్త, అత్త మామలను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఐశ్వర్య సూసైడ్ నోట్ రాసిందని పోలీసులు తెలిపారు. భర్త అత్తమామలు తనను, పిల్లలను ఏనాడూ సరిగా చూడలేదని ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. తాను చనిపోతే పిల్లలు అనాథలవుతారనే భయంతో పిల్లల్ని కూడా తీసుకెళుతున్నానని, తనను తల్లిదండ్రులు క్షమించాలని కోరిందన్నారు.
ఐశ్యర్య ఆమె పిల్లల ఆత్మహత్యతో గొల్లగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముగ్గురి మృత దేహాలను చూసి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు చలించిపోయారు. గ్రామమంతా రోదనలతో మిన్నంటింది. భర్త మహేష్, అత్త మామలు సత్తమ్మ, నర్సింహను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మళ్లీ జన్మంటూ ఉంటే నీకు కొడుకుగా పుట్టి రుణం తీర్చుకుంటా డాడీ, అమ్మాయిగా మాత్రం అస్సలు పుట్టను.. అంటూ ఐశ్వర్య సూసైడ్ నోట్లో రాసుకొచ్చింది. మా ముగ్గురి మృతదేహాలను బాయికాడ రేగు చెట్టు కింద ఒకే దగ్గర బొందపెట్టు.. ప్రతి రోజూ నిన్ను చూడకుండా ఉండలేను డాడీ..అని ఐశ్యర్య ఆ లేఖలో పేర్కొన్నది. ’కలిసిన ప్రతి ఒక్కరూ నువ్వు అత్తగారింటికి పోతలేవా అంటే నా మనసు సచ్చిపోతోంది. నా చావుకు, నా పిల్లల చావుకు నా భర్త మేకల మహేష్, అత్త మామలు మేకల నర్సింహా, మేకల సత్తమ్మలే కారణమని, వారికి జీవితాంతం శిక్ష పడేలా చూడాలని’ కోరింది.