వడ్డీ రేట్లు మళ్లీ పెంచే యోచనలో ఆర్బీఐ
ఇటీవలే 40 పాయింట్లు పెంచిన వైనం
మరో 35 పాయింట్లు పెంచాలని ఆలోచన
ఎల్లుండి ప్రకటన చేయనున్న గవర్నర్
సామాన్యులకు అందని ద్రాక్షగా గృహరుణాలు
ముంబై, జూన్ 5: పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో దినదినగండంగా బతుకీడుస్తున్న సామాన్యులకు మరో పిడుగులాంటి వార్త. ద్రవ్యోల్బణాన్ని సాకుగా చూపుతూ వడ్డీ రేట్లను మళ్లీ పెంచడానికి ఆర్బీఐతో కలిసి కేంద్రంలోని మోదీ సర్కారు సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో సామాన్యులకు రుణాలు భారంగా మారాయి. మళ్లీ వడ్డీ రేట్లు పెంచితే మధ్య తరగతి జీవులకు గృహ, వ్యక్తిగత తదితర రుణాలు అందని ద్రాక్షగా మారనున్నాయి.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కూడా వడ్డీరేట్ల మలి పెంపుపై ఇప్పటికే చూచాయగా సంకేతాలిచ్చారు. కీలక వడ్డీ రేట్లను ఇటీవల 40 బేసిస్ పాయింట్లు పెంచినప్పటికీ.. ద్రవ్యోల్బణం దిగిరాలేదు. దీంతో ద్రవ్య, పరపతి విధాన కమిటీ సమావేశంలో 35 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. శక్తికాంతదాస్ అధ్యక్షతన బుధవారం జరిగే సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వేరే మార్గాలున్నా కూడా మధ్యతరగతి ప్రజలకు భారంగా మారే అవకాశం ఉన్న వడ్డీ రేట్లనే పెంచేందుకు ఆర్బీఐ, మోదీ సర్కారు మొగ్గుచూపుతున్నారు.
ఎంత పెంచవచ్చు? నిపుణులు ఏమంటున్నారు?
ఎంపీసీ పాలసీ సమీక్షలో ఆర్బీఐ వడ్డీ రేటును 50 పాయింట్లు పెంచే అవకాశం ఉందని క్రిసిల్ ప్రధాన ఆర్థికవేత్త డీకే జోషి చెప్పారు. 25- 35 పాయింట్లు పెంచొచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నావిస్ పేర్కొంటున్నారు. కరోనా మహమ్మారి కన్నా ముందున్న మాదిరిగా రెపో రేటును 5.15 శాతానికి చేరువ చేసే యోచనలో ఆర్బీఐ ఉందని కొటక్ ఈక్విటీల్లో సీనియర్ ఎకనమిస్ట్ సువోదీప్ రక్షిత్ పేర్కొన్నారు. ప్రస్తుత రెపోరేటు 4.4 శాతంగా ఉన్నది.