ముంబై: ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకున్నది. కీలక వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లకు పెంచింది. తక్షణమే కొత్త రెపో రేట్లు అమలులోకి రానున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ద్రవ్యపరపతి కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మే 2 నుంచి 4వ తేదీ మధ్య జరిగిన మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లను పెంచాల్సి వస్తుందని దాస్ తెలిపారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, నిత్యావసరాల కొరత ఏర్పడడం వల్ల భారతీయ ఆర్థిక వ్యవస్థపై పెను భారంపడినట్లు గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు.
మే 2020 తర్వాత తొలిసారి ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. ఆహార ద్రవ్యోల్బణం అధికంగా ఉండనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా గోధుమ సంక్షోభం ఏర్పడినట్లు ఆయన తెలిపారు. దీని వల్ల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల నూనె ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నట్లు దాస్ తెలిపారు.