న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: అదానీ గ్రూప్నకు ఇచ్చిన రుణా లు, ఇతర ఆర్థిక సహకారాల వివరాలు అందించాలని బ్యాం క్ల్ని రిజర్వ్బ్యాంక్ ఆదేశించింది. అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆ గ్రూప్ షేర్లు పతనంకావడంతో అదానీ ఎంటర్ప్రైజెస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీవో)ను రద్దు చేసుకున్న మరుసటి రోజునే రిజర్వ్ బ్యాంక్ ఈ ఆదేశాలు జారీచేయ డం గమనార్హం. సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (సీఆర్ఐఎల్సీ) డాటా బేస్ నుంచి ఆర్బీఐ ఎప్పటికప్పుడు బ్యాంక్లు రుణాలిచ్చిన పెద్ద కార్పొరేట్ రుణగ్రస్తుల గురించి తెలుసుకుంటూ ఉంటుందని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి.
చాలా సందర్భాల్లో బ్యాంక్లు ఆయా కార్పొరేట్లు తనఖా చేసిన షేర్లపై రుణాలిస్తుంటాయి. అదానీ గ్రూప్లోని 10 కంపెనీ ల షేర్లు తీవ్రంగా పతనమైనందున, తనఖా పెట్టిన షేర్ల విలువ తరిగిపోతుంది. అటువంటి సమయంలో ఆ తరుగుదలకు సరిపడా వెనువెంటనే కార్పొరేట్లు డబ్బు చెల్లించడమో లేదా అదనంగా షేర్లను తనఖా చేయడమో జరగాలి. లేదంటే బ్యాంక్లకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ఈ కారణంగా స్టాక్స్ తనఖాపై ఇచ్చిన రుణా లు, ఇతర పరోక్ష రుణ వితరణ (బ్యాంక్ గ్యారంటీలు, ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ వంటివి) వివరాలివ్వాలని బ్యాంక్ల్ని ఆర్బీఐ కోరినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదానీ గ్రూప్ కృత్రిమంగా అధిక విలువలకు చేరిన షేర్లపై తీసుకున్న రుణాలు భారీగా ఉన్నాయని అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ గతవారం ఆరోపించిన సంగతి తెలిసిందే. హిండెన్బర్గ్ రిపోర్ట్తో షేర్ల పతనంతో వారం రోజుల్లోనే అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్ల మేర పడిపోయింది.
ఎస్బీఐ రుణం రూ. 21,000 కోట్లు
అదానీ గ్రూప్ కంపెనీలకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ. 21,000 కోట్ల వరకూ రుణాలిచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ రుణాల్లో ఎస్బీఐ చెందిన విదేశీ శాఖలు ఇచ్చిన 200 మిలియన్ డాలర్ల అప్పు కూడా ఉందని బ్లూంబర్గ్ వార్తా సంస్థ గురువారం ప్రచురించిన ఒక కథనంలో పేర్కొంది. అదానీకి తాము ఇచ్చిన రుణాలపై ఆందోళనా లేదంటూ ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా ఇటీవల తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) సైతం అదా నీ గ్రూప్నకు రూ. 7,000 కోట్ల రుణాలు ఇచ్చినట్టు వెల్లడించింది. ఈ రూ. 7,000 కోట్లలో రూ. 2,500 కోట్లు అదానీ ఎయిర్పోర్టుల వ్యాపారానికి రుణాలిచ్చినట్టు పీఎన్బీ సీఈవో అతుల్ కుమార్ గోయల్ తెలిపారు. హిండెన్బర్గ్ రిపోర్ట్ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాల్ని గమనిస్తున్నట్టు పేర్కొన్నారు. మరో వైపు అదానీ గ్రూప్ బాండ్లు, ఈక్విటీల్లో రూ.36,474 కోట్లు పెట్టుబడి చేసినట్టు ఎల్ఐసీ వెల్లడించింది. తమ మొత్తం పెట్టుబడుల్లో ఇది 1 శాతం మాత్రమేనని పేర్కొన్నది.