ముంబై: బ్యాంకు ఖాతాదారుల అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి ఆర్బీఐ సమగ్ర మార్గదర్శకాలు వెలువరించింది. సదరు ఖాతాదారుల ఆచూకీ తెలుసుకునేందుకు తరచూ ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని బ్యాంకులకు సూచించింది. బ్యాంకింగ్ వ్యవస్థలో అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లను తగ్గించేందుకు, ఆ నిధులను వాటి అసలు యజమానులకు తిరిగి అందించేందుకు ఇప్పటికే బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకు తీసుకుంటున్న చర్యలకు ఈ మార్గదర్శకాలు అదనపు మద్దతు ఇవ్వనున్నాయి.
ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం బ్యాంకులు వినియోగంలో లేని ఖాతాలు, అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి లేఖలు, ఈ మెయిల్ లేదా ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఖాతాదారులను సంప్రదించాలి. ఈ మెయిల్/ఎస్ఎంఎస్లను మూడు నెలలకు ఒకసారి పంపాలి. అవసరమైతే ఖాతాదారును కనుగొనేందుకు ఇంట్రడ్యూసర్ను, నామినీని కూడా సంప్రదించాలి.