న్యూఢిల్లీ: పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పరిశీలిస్తున్నదని ఆ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శనివారం తెలిపారు. ‘మేము దీని లాభనష్టాలు, అమలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నాం’ అని ఆయన చెప్పారు.
పాలిమర్ నోట్లకు సంబంధించి వచ్చిన వార్తల్లో వాస్తవం ఉన్నదని, అయితే కేంద్ర బ్యాంకు దీనిపై నిర్ణయానికి రాలేదని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో నగదు కొరత ఏర్పడిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థ అంతటా పంపిణీకి తగినంత నగదు అందుబాటులో ఉన్నదని స్పష్టం చేశారు. స్థానికంగా ఎక్కడైనా కొరత ఏర్పడితే త్వరగా స్పందించడానికి కేంద్ర బ్యాంకు సిద్ధంగా ఉన్నదని తెలిపారు.