RBI | ముంబై, మే 19: 2016 నవంబర్ 8 పెద్దనోట్ల రద్దు కుదుపుతో ఆర్థికవ్యవస్థ అతలాకుతలమైంది. హతాశులై చనిపోయినవారెందరో. ఆ గాయాలను దాటుకుని దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. ఈ దశలో రూ.2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. మంగళవారం నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రజలు బ్యాంకుల్లో, ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2000 నోట్లు మార్చుకోవచ్చునని తెలిపింది. నోట్ల రద్దుపై అప్పుడూ, ఇప్పుడూ కేంద్రం చెప్తున్నది మాత్రం ‘నల్లధనం కట్టడి’ కోసమేనని. మరి, అప్పుడెందుకు కాలేదో.. ఇప్పుడెలా అవుతుందో.. సగటుజీవి ప్రశ్నకు సమాధానం చెప్పేదెవరు?
చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లను రద్దు చేస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకున్నది. ‘క్లీన్ నోట్ పాలసీ’ కింద రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు తక్షణమే రూ.2,000 నోట్లనివ్వడం ఆపేయాలని అన్ని బ్యాంకులనూ ఆదేశించింది. అలాగే ప్రస్తుతమున్న రూ.2,000 నోట్లను బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చంటూ ఓ ప్రకటనలో ప్రజలకు ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే ఈ అవకాశం సెప్టెంబర్ 30దాకే ఉంటుందన్నది. ఆర్బీఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లోనూ నోట్ల మార్పిడికి వీలుంటుంది. ఇక మంగళవారం (మే 23) నుంచి బ్యాంకుల్లో రూ.2,000 నోట్లను ఖాతాదారులు తమ అకౌంట్లలో డిపాజిట్ చేసి, అందుకు సమానమైన మొత్తాల్లో ఇతర నోట్లను తిరిగి తీసుకోవచ్చన్న ఆర్బీఐ.. రోజుకు రూ.20వేలకు మించి మార్చడం కుదరదని కూడా చెప్పింది.
నాటి దుస్థితే వస్తుందా..?
నల్లధనం వెలికితీత పేరుతో 2016 నవంబర్ 8 రాత్రి పాత రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన రీతిలో ప్రకటించిన విషయం తెలిసిందే. రైద్దెన నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చన్న సంగతీ విదితమే. అయితే నోట్ల మార్పిడి సందర్భంగా అంతా ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఇప్పటికీ మరువడం కష్టమే. ముందస్తు ఏర్పాట్లు లేకపోవడంతో చాలామంది నష్టపోయారు. కొంతమంది ప్రాణాలను సైతం కోల్పోవడం దురదృష్టకరం. ఇక వేగంగా నోట్ల మార్పిడి ప్రక్రియ జరగాలన్న తొందర్లో ఎవరూ ఊహించని రీతిలో రూ.2,000 నోట్లను చలామణిలోకి తెచ్చారు. 2017 మార్చికి ముందు దేశంలో చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో రూ.2,000 నోట్లే దాదాపు 89 శాతం కావడం గమనార్హం. ఇప్పుడు ఈ రూ.2,000 నోట్లనూ ఆర్బీఐ రద్దు చేస్తుండటంతో వీటి మార్పిడికి జనాలు ఇంకెన్ని ఇబ్బందులు పడ్సాలి వస్తుందోనన్న భయాలు సర్వత్రా కనిపిస్తున్నాయిప్పుడు.
అక్రమాలకు ఆస్కారం?
గతంలో పాత పెద్ద నోట్ల రద్దు సమయంలో ఎన్ని అక్రమాలు వెలుగుచూశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ పెద్దల అవినీతిపై అనేకానేక ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా నోట్ల మార్పిడితో రకరకాల ప్రలోభాలు, అవకతవకలకు ఆస్కారం ఉంటుందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజానికి రూ.2,000 నోట్ల ముద్రణను 2018-19 నుంచే ఆపేసిన ఆర్బీఐ.. చలామణిలో వాటి సంఖ్యను గణనీయంగానే తగ్గించింది. అయినప్పటికీ వాటి చలామణి కొనసాగుతూనే ఉన్నది. ఇప్పుడీ నిర్ణయంతో పూర్తిగా వాటిని రద్దు చేసినట్టు కానున్నది.