Ratna Bhandar : పూరీ జగన్నాథుడి ఆలయంలోని రత్న భాండాగారం తలుపులు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. దాదాపు 46 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తలుపులను తెరిచారు. మధ్యాహ్నం 1.28 గంటలకు రత్న భాండాగారం తలుపులు తెరిచే ప్రక్రియను ప్రారంభించారు. ఆ తర్వాత కొంత సమయానికి తలుపులు తెరుచుకున్నాయి. ఈ విషయాన్ని ఒడిశా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
మొత్తం 11 మంది సిబ్బంది రంగంలోకి దిగి ఈ తలుపులు తెరిచే ప్రక్రియ చేపట్టారు. తలుపులు తెరిచే సందర్భంగా ఆలయంలో జగన్నాథుడి సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేశారు. ఈసారి రత్న భాండాగారంలోని చెక్క పెట్టెల్లో భద్రపర్చిన ఆభరణాల లెక్కింపు ప్రక్రియనంతా డిజిటలైజ్ చేయనున్నారు. నిధిని మరో చోటకు తరలించేందుకు కొత్తగా ఆరు భారీ చెక్క పెట్టెలను ఏర్పాటు చేశారు.
తలుపులు తెరిచేందుకు ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి బిశ్వనాథ్ రథ్, శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాధీతోపాటు ASI సూపరింటెండెంట్ లోపలికి వెళ్లారు. వీళ్లతోపాటు నలుగురు ఆలయ సహాయకులు కూడా వెళ్లినట్టు అధికారులు వెల్లడించారు. ఈ భాండాగారం తలుపులు తెరిచే ముందు ‘ఆజ్ఞ’ పేరుతో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. డిజిటల్ డాక్యుమెంటేషన్ తర్వాత లోపలి నిధిని వేరేచోటుకు తరలించనున్నారు.
1978లో చివరిసారి ఈ భాండాగారాన్ని తెరిచారు. ఆ సమయంలో లోపల ఉన్న సంపదను లెక్కించేందుకు 70 రోజుల సమయం పట్టింది. బంగారం, వెండితోపాటు వజ్రాలనూ గుర్తించారు. వీటన్నింటిని లెక్కించి ఓ జాబితా రూపొందించారు. ఈసారి లోపలి సంపదను లెక్కించేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. అసలు లోపల ఏమున్నాయన్న ఆసక్తీ పెరుగుతున్నది. మరమ్మతులు పూర్తయ్యేదాకా సంపదను వేరేచోట భద్రపర్చనున్నారు.