ముంబై: టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు మానవత్వమే కాదు జంతువుల పట్ల, ముఖ్యంగా కుక్కల పట్ల ప్రగాఢమైన ప్రేమ, కరుణ ఉన్నాయి. పెంపుడు కుక్క ‘గోవా’ రతన్ టాటాకు కడసారి నివాళి అర్పించింది. (Ratan Tata’s Dog ‘Goa’), హృదయాన్ని హత్తుకునే ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 11 ఏళ్ల కిందట రతన్ టాటా గోవా వెళ్లినప్పుడు ఒక వీధి కుక్క ఆయనను అనుసరించింది. దీంతో దానిని పెంచుకుకోవాలని నిర్ణయించి ముంబై తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో బాంబే హౌస్లోకి దానికి ఘనంగా స్వాగతం లభించింది. గోవా నుంచి తెచ్చిన ఆ కుక్కకు ‘గోవా’ అని ఆయన పేరుపెట్టారు. బాంబే హౌస్లోని ఇతర కుక్కలతోపాటు ఆ కుక్క కూడా పెరిగింది. ‘గోవా’తోపాటు ఇతర కుక్కలతో దిగిన ఫొటోను రతన్ టాటా ఇన్స్ట్రాగ్రామ్లో కూడా షేర్ చేశారు.
కాగా, రతన్ టాటాకు కుక్కలతో చాలా అనుబంధం ఉంది. 2018లో బ్రిటిష్ రాజ కుటుంబం నుంచి ప్రతిష్టాత్మకమైన లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఆయన అందుకోవాల్సి ఉంది. రతన్ టాటా దాతృత్వం, విరాళాలను గౌరవించేందుకు నాటి ప్రిన్స్ చార్లెస్, బ్రిటీష్ ఆసియన్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే రతన్ టాటా దీనికి హాజరుకాలేదు. అనారోగ్యంతో ఉన్న తన పెంపుడు కుక్కను చూసుకోవడానికి ఇంట్లోనే ఆయన ఉండిపోయారు. ‘టాంగో, టిటో నా కుక్కలు. వాటిలో ఒకటి భయంకరమైన అనారోగ్యానికి గురైంది. నేను దానిని వదిలి రాలేను’ అని రతన్ టాటా పేర్కొన్నారు. వ్యాపారవేత్త సుహెల్ సేథ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
మరోవైపు పెంపుడు కుక్కల ఆరోగ్యం, సంక్షేమం కోసం కూడా రతన్ టాటా శ్రమించారు. జంతువుల సంరక్షణ కోసం రూ.165 కోట్ల వ్యయంతో అధునాతన వైద్య సేవలతో కూడిన స్మాల్ యానిమల్ హాస్పిటల్ (ఎస్ఏహెచ్ఎం)ను ముంబైలో ఏర్పాటు చేశారు. 2017లో చేపట్టిన ఈ ప్రాజెక్ ఈ ఏడాదిలో పూర్తయ్యింది. అతి పెద్ద జంతువుల హాస్పిటల్ ఈ ఏడాది జూలైలో ప్రారంభమైంది. ఐదు అంతస్తులతో కూడిన ఈ ఆసుపత్రిలో సుమారు 200 పెంపుడు జంతువులకు ఏక కాలంలో వైద్య సేవలు అందించే సౌకర్యాలు ఉన్నాయి.
Ratan Tata’s love for dogs was legendary. His pet (Goa) meeting him for the last time 💔 #Ratan #RatanTata pic.twitter.com/paX54zihwu
— Prashant Nair (@_prashantnair) October 10, 2024