న్యూఢిల్లీ: పీఎం కేర్స్ ఫండ్ కొత్త ట్రస్టీలుగా టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా, సుప్రీంకోర్టు మాజీ న్యాయవాది జస్టిస్ కేటీ థామస్, మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పీఎం కేర్స్ ఫండ్ బోర్డు ట్రస్టీల సమావేశం మంగళవారం జరిగింది. ట్రస్టీలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా నామినేట్ అయిన ట్రస్టీలను ప్రధాని మోదీ స్వాగతించారు. కొత్త ట్రస్టీలు, సలహాదారుల భాగస్వామ్యం పీఎం కేర్స్ ఫండ్ పనితీరును విస్తరిస్తుందని తెలిపారు. ప్రజా జీవితంలో వారి అపార అనుభవం వివిధ ప్రజా అవసరాలకు మరింత ప్రతిస్పందించేలా చేయడంలో మరింత శక్తిని ఇస్తుందని అన్నారు.
కాగా, పీఎం కేర్స్ ఫండ్కు సలహా బోర్డు ఏర్పాటు కోసం ప్రముఖ వ్యక్తులను నామినేట్ చేయాలని ట్రస్ట్ నిర్ణయించింది. మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రాజీవ్ మెహ్రిషి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్పర్సన్ సుధా మూర్తి, టీచ్ ఫర్ ఇండియా సహ వ్యవస్థాపకుడు, ఇండికార్ప్స్, పిరమల్ ఫౌండేషన్ మాజీ సీఈవో ఆనంద్ షా బోర్డు సలహాదారులుగా ఉండనున్నారు. మరోవైపు పీఎం కేర్స్ ఫండ్కు హృదయ పూర్వకంగా విరాళాలు అందించిన దేశ ప్రజలను ప్రధాని మోదీ ప్రశంసించినట్లు పీఎంవో కార్యాలయం బుధవారం పేర్కొంది.