Mumbai watermelon : ముంబైలో ఇటీవల బిర్యానీ, ఆ తర్వాత వాటర్ మిలన్ తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్త సంచలనం కలిగించింది. వీరిది హత్యా, ఆత్మహత్యా, అనుకోకుండా జరిగిన ఘటనా అనే విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ అంశంలో ఇప్పుడు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నలుగురి మరణానికి ఎలుకలే మందే కారణమయ్యుండొచ్చని పోలీసులు అంచనాకు వచ్చారు.
ఎందుకంటే వారు తిన్న వాటర్ మిలన్లో ఎలుకల మందుగా వాడే జింక్ ఫాస్ఫైడ్ అనే రసాయనం ఉన్నట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పరిశోధనలో తేలింది. దీన్ని ఎలుకల మందుగా వాడుతారు. అయితే, ఇది వాటర్ మిలన్లోకి ఎలా వచ్చిందనేది అంతుచిక్కడం లేదు. అనుకోకుండా ఇది వారి వాటర్ మిలన్లో కలిసిందా, లేక వారే తీసుకున్నారా.. ఇంకెవరైనా కలిపారా అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. వారి మృతిపై పోలీసులు ఇంకా విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనలో వారు సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు అంటున్నారు. మృతుల బంధువులు, స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా పోలీసులు ఈ నిర్ధరణకు వచ్చారు.
కేసు తదుపరి విచారణ ఇంకా కొనసాగుతోంది. గత నెల 25న అర్ధరాత్రి ముంబైలోని ఘారి మొహల్లాకు చెందిన డొకాడియా కుటుంబానికి చెందిన నలుగురు వాటర్ మిలన్ తినడం వల్ల అనారోగ్యానికి గురయ్యారు. అబ్దుల్ డొకాడియా, అతడి భార్య నస్రీన్, వారి పిల్లలు ఆయేషా, జైనబ్లు వాటర్ మిలన్ తిన్న కొన్ని గంటల వ్యవధిలోనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర వాంతులు, విరేచనాలతో జేజే ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఈ ఘటన సంచలనం సృష్టించింది.