విశాఖపట్నం: విశాఖపట్నం నగరంలోని సాగర్నగర్ ఇస్కాన్ కేంద్రం సమీపంలోగల సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఓ అరుదైన చేప చిక్కింది. ఈ చేప చూడటానికి చాలా వింతగా ఉంది. ఈ చేప కడుపు కింద రెండు, వీపు పైన ఒక ముల్లు ఉన్నాయి. కడుపు కింద బోర్లించిన V ఆకారంలో ఉన్న ముళ్లపై చేప నిలబడి ఉంది. దీనికి ప్రత్యేకంగా మూడు ముళ్లు ఉండటంతో దీన్ని మూడు ముళ్ల చేప అని అంటున్నారు.
అయితే, అత్యంత అరుదుగా కనిపించే ఈ చేపలను బవిరి చేపలు అంటారని ఏపీ మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పీ శ్రీనివాసరావు చెప్పారు. సముద్ర జలాల్లో చాలా లోపల సంచరించే ఈ బవిరి చేపలు అత్యంత అరుదుగా పైకి వస్తాయని ఆయన తెలిపారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చలికాలంలో పైకి వచ్చే క్రమంలో ఇలా వలలకు చిక్కుతాయని ఆయన వెల్లడించారు.