Actress Ranya Rao : గోల్డ్ స్మగ్లింగ్ కేసు (Gold Smuggling Case) లో నిందితురాలిగా ఉన్న నటి రన్యా రావు (Actress Ranya Rao) కు సంబంధించి ఓ నమ్మలేని నిజం వెలుగులోకి వచ్చింది. అక్రమ మార్గంలో కోట్లు సంపాదించాలని స్మగ్లింగ్ మొదలుపెట్టిన రన్యారావు.. అదే ప్రయత్నంలో ఏజెంట్ చేతిలో మోసపోయి రూ.2 కోట్లు పోగొట్టుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణలో వెల్లడైంది. ఈ విషయాన్ని ఈడీ తన చార్జిషీట్ (ED Charge Sheet) లో పేర్కొన్నది.
తక్కువ ధరకు నేరుగా ఆఫ్రికా గనుల నుంచి బంగారం కొనుగోలు చేయాలని రన్యా ముందుగా ప్లాన్ చేసింది. ఇందుకోసం ‘బెన్’ అనే ఉగాండా ఏజెంట్ను నమ్మింది. అయితే ఆ ఏజెంట్ ఆమె నుంచి రూ.2 కోట్లు తీసుకుని బంగారం ఇవ్వకుండా మోసం చేశాడు. ఆఫ్రికాలో మోసపోయిన తర్వాత, రన్యా తన పంథా మార్చింది. దుబాయ్ మార్కెట్లో బంగారం కొని భారత్కు అక్రమంగా తరలించడం ప్రారంభించింది. తన సవతి తండ్రి సీనియర్ పోలీస్ అధికారి కావడంతో ఎయిర్పోర్టులో లభించే ‘ప్రొటోకాల్’ సౌకర్యాన్ని దుర్వినియోగం చేసింది. దీని ద్వారా కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి సులభంగా తప్పించుకునేది.
2024 మార్చి నుంచి 2025 మార్చి మధ్య కేవలం ఏడాది కాలంలోనే ఆమె 15 సార్లు దుబాయ్ వెళ్లివచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ పర్యటనల్లో సుమారు 127 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు ఈడీ తన ఛార్జ్షీట్లో పేర్కొన్నది. దీని విలువ సుమారు రూ.102 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఈ కేసులో రన్యా రావు బెంగళూరు సెంట్రల్ జైలులో ఉంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆమెకు సుమారు రూ.102.55 కోట్ల భారీ జరిమానా విధించింది. ఈ కేసులో ఆమె తండ్రి పాత్రపై కూడా అంతర్గత విచారణ కొనసాగుతోంది.