న్యూఢిల్లీ : కాషాయ పార్టీని ఎండగడుతూ కాంగ్రెస్ నేత రణ్దీప్ సుర్జీవాలా మహాభారతాన్ని ప్రస్తావిస్తూ నోరుజారారు. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణాన్ని ప్రస్తావించబోయి పొరపాటున సీతాదేవి పేరును ఉటంకించి అడ్డంగా దొరికిపోయారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలను, ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు ఏజెన్సీలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని చెబుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజ్యాంగ వ్యవస్ధల ప్రాధాన్యతకు కేంద్రం తూట్లుపొడుస్తోందని గత ఎన్నికల్లో కాషాయ పార్టీ నైతికంగా ఓటమి పాలయిందని విమర్శించారు. సీతాదేవి వస్త్రాపహరణం తరహాలోనే బీజేపీ ప్రజాస్వామ్య వలువలు ఊడదీయాలని కాషాయ పార్టీ కోరుకుంటోందని దుయ్యబట్టారు.
బీజేపీ ప్రయత్నాలు ఫలించబోవని, రాజ్యసభ ఎన్నికల్లో వారికి భంగపాటు తప్పదని సుర్జీవాలా అన్నారు. దృతరాష్ట్రుడి సభలో పాండవుల సమక్షంలో ద్రౌపది వస్త్రాపహరణం ఘట్టాన్ని గురించి ప్రస్తావించబోయిన సుర్జీవాలా పొరపాటున సీత పేరు ప్రస్తావించారు. సుర్జీవాలా వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. శ్రీరాముడి ఉనికిని కాంగ్రెస్ నిరాకరిస్తోందని వ్యాఖ్యానించింది. ఇక రణ్దీప్ సుర్జీవాలా వ్యాఖ్యల వీడియో ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది.