Ram Temple: అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ నెల 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యేందుకు దేశవ్యాప్తంగా వేలమంది ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం కోసం దళిత ప్రముఖుల కుటుంబాలకు, కరసేవకులకు, పలువురు ఇతర ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. కానీ, ముఖ్యమంత్రుల్లో మాత్రం ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్కు తప్ప మరే సీఎంకు ఆహ్వానం అందలేదు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ మినహా దేశంలోని మరే ముఖ్యమంత్రికి అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం అందలేని రామాలయ వర్గాలు వెల్లడించాయి. ఆహ్వానం అందిన దళిత ప్రముఖుల కుటుంబాల్లో బీఆర్ అంబేద్కర్, జగ్జీవన్రామ్, కాన్షీరామ్ కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా రామజన్మ భూమి ఉద్యమం సందర్భంగా మరణించిన కరసేవకుల కుటుంబాలకు కూడా ఆహ్వానాలు అందాయి.
అదేవిధంగా ముగ్గురు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తులు, విశ్రాంత త్రివిధ దళాల చీఫ్లు, మాజీ రాయబారులు, ఉన్నతాధికారులు, కీలక హోదాలో ఉన్న ఐపీఎస్ అధికారులు, నోబెల్ పురస్కారాలు అందుకున్న సోదరసోదరీమణులు కూడా అయోధ్య రామాలయంలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యే వారిలో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌధరిలకు కూడా ఆహ్వానాలు అందినప్పటికీ.. తాము ఆ కార్యక్రమానికి హాజరుకావడంలేదని వారు ప్రకటించారు. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ అనేది బీజేపీ, దాని మాతృసంస్థ ఆరెస్సెస్ నిర్వహిస్తున్న ఒక రాజకీయ కార్యక్రమమని విమర్శించారు. టీఎంసీ కూడా తనకు అందిన ఆహ్వానాన్ని తిరస్కరించింది.