హరిద్వార్: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జనవరి 22న జరుగనున్న రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి (Ram Temple consecration) నలుగురు శంకరాచార్యులు హాజరుకావడం లేదని ఉత్తరాఖండ్లోని జ్యోతిర్ మఠానికి చెందిన 46వ శంకరాచార్య అయిన అవిముక్తేశ్వరానంద సరస్వతి తెలిపారు. ఆలయ నిర్మాణం అసంపూర్తిగా ఉందని, శాస్త్రాలకు వ్యతిరేకంగా ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతున్నదని ఆరోపించారు. సనాతన ధర్మం నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున అతి ముఖ్యమైన హిందూ మత గురువులు ఈ మహోత్సవానికి హాజరుకావడం లేదని హరిద్వార్లో మీడియాతో అన్నారు. ఆలయ నిర్మాణం పూర్తి చేయకుండా రాముడి విగ్రహాలను ప్రతిష్ఠించడం హిందూ మతానికి విరుద్ధమని విమర్శించారు. ప్రతిష్ఠాపనకు అంత తొందర అవసరం లేదన్నారు. రామమందిర నిర్మాణం పూర్తైన తర్వాత విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.
కాగా, ప్రధాని మోదీకి తాము వ్యతిరేకం కాదని అవిముక్తేశ్వరానంద సరస్వతి అన్నారు. ‘మమల్ని మోదీ వ్యతిరేకి అనవచ్చు. అయితే మేం మోదీకి వ్యతిరేకం కాదు. అదే సమయంలో మన ధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా కూడా వెళ్ళలేం’ అని స్పష్టం చేశారు. జనవరి 22న అయోధ్యలో జరుగనున్న రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మఠాధిపతులు, పిఠాధిపతులు, సాధువులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలతో సహా వేలాది మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
మరోవైపు ఆలయ ట్రస్ట్ ప్రకారం రామాలయంలో మొదటి అంతస్తు, గర్భగుడి మాత్రమే సిద్ధంగా ఉంది. వచ్చే రెండేళ్లలో ఆలయాన్ని పూర్తి స్థాయిలో నిర్మిస్తామని ట్రస్ట్ తెలిపింది. ఈ నేపథ్యంలో పూరీ గోవర్ధన్ పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి కూడా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరుకావడం లేదని ఇటీవల తెలిపారు. హిందూ మతం నిబంధనలు, గ్రంథాలకు విరుద్ధంగా ఈ కార్యక్రమం జరుగుతున్నదని ఆరోపించారు. స్కంద పురాణం ప్రకారం కర్మలు సక్రమంగా నిర్వహించకపోతే విగ్రహంలోకి చెడు శకునాలు ప్రవేశించవచ్చని ఆయన అన్నారు.
All four Shankaracharya’s are not attending 22nd January event.
Why???
Listen to Swami Avimukteshwaranand Ji👇 pic.twitter.com/PWnmgUuwrj— Swati Dixit ಸ್ವಾತಿ (@vibewidyou) January 10, 2024