Ram Mandir | అయోధ్య: సాధారణ భక్తులకు అందుబాటులోకి వచ్చిన అయోధ్య రామయ్యను దర్శించుకొనే వారి సంఖ్య భారీగా ఉంటున్నది. తొలిరోజు 5 లక్షల మంది భక్తులు దర్శించుకోగా, రెండో రోజు (బుధవారం) 3 లక్షల మంది మూలవిరాట్ను దర్శించుకున్నారు. పటిష్ఠ భద్రత మధ్య భక్తులను దర్శనానికి పంపిస్తున్నారు. అయోధ్యలో భక్తుల రద్దీ నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ మంత్రులు ప్రస్తుతం దర్శనానికి వెళ్లొద్దని ప్రధాని మోదీ సూచించినట్టు సమాచారం. ప్రొటోకాల్స్ దృష్ట్యా సామాన్య భక్తులకు అసౌకర్యం కలుగుతుందని, ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు మార్చిలో బాలరాముడి దర్శనా నికి వెళ్లాలని సూచించినట్టు తెలిసింది.
రామయ్య దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్న నేపథ్యంలో దర్శన వేళలను పొడిగిస్తూ రామ తీర్థ్ ట్రస్టు నిర్ణయం తీసుకొన్నది. సాయంత్రం 7 గంటల వరకే ఉన్న దర్శన సమయాన్ని రాత్రి 10 గంటల వరకు పొడిగించారు. కాగా, దర్శనానికి 10-15 రోజుల తర్వాతే రావాలని అధికారులు భక్తులను కోరుతున్నారు. మరోవైపు రద్దీని తగ్గించేందుకు అయోధ్యకు బస్సు సర్వీసులను నిలిపివేశారు.
అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మంగళవారం ఓ వానరం రాముడిని దర్శించుకొన్నది. దక్షిణ ద్వారం గుండా ఆలయంలోకి వచ్చిన వానరాన్ని వెళ్లగొట్టేందుకు సిబ్బంది పరుగెత్తుకురాగా,అది ఏ అపాయం చేయకుండా, రాముడి విగ్రహం దగ్గరికి వెళ్లి అనంతరం ఉత్తర ద్వారం గుండా బయటికి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను ట్రస్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీన్ని చూసిన భక్తులంతా.. ఆంజనేయస్వామి రాముడిని దర్శించుకొని వెళ్లాడని పేర్కొంటున్నారు.
అయోధ్యలోని కుబర్ తిలలో ప్రధాని ప్రారంభించిన జటాయు విగ్రహ తయారీకి 3 నెలలు పట్టిందని శిల్పి రామ్ సుతార్(99) తెలిపారు. దాని గురించి రిసెర్చ్ చేయటానికే 2నెలలు పట్టిందని చెప్పారు. 3.5 టన్నుల బరువున్న ఈ విగ్రహాన్ని కాపర్ (85%), టిన్ (5%), జింక్ (5%), సీసం (5%) మిశ్రమాలతో తయారుచేసినట్టు వివరించారు.