Ayodhya Ram Mandir | అయోధ్య, జనవరి 18: అయోధ్యలో ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ క్రతువుల్లో భాగంగా గురువారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. అయోధ్య రామాలయ గర్భగుడిలోకి రామ్ లల్లా విగ్రహాన్ని చేర్చారు. తెల్లవారుజామునే జై శ్రీరామ్ నినాదాలు, పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య క్రేన్ సహాయంతో విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకొచ్చారు. అనంతరం బాల రామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గర్భగుడిలో రామ్ లల్లాను ప్రతిష్ఠించేందుకు ముందు విగ్రహాన్ని నీటితో శుభ్రం చేసే జలదివస్తో పాటు గణేశ పూజ, వరుణ పూజ నిర్వహించారు. కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి చేతుల మీదుగా రూపుదిద్దుకున్న 51 అంగుళాల ఈ విగ్రహం బుధవారం రాత్రి అయోధ్యకు చేరగా, క్రేన్ సహయంతో దానికి ఆలయ ప్రాంగణానికి చేర్చారు. అక్కడి నుంచి గురువారం ఉదయం గర్భగుడిలోకి చేర్చారు. 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలు మంగళవారమే ప్రారంభం కాగా, ఆ రోజు నదీ ఒడ్డున దీపోత్సవం, హారతి, బుధవారం కలశ పూజ వంటి క్రతువులు నిర్వహించారు.
ఆన్లైన్లో అయోధ్య ప్రసాదం అమ్మకం లేదు
ప్రస్తుతానికి అయోధ్య రాముని ప్రసాదం ఆన్లైన్లో అందుబాటులో ఉంచలేదని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ గురువారం స్పష్టం చేసింది. అయోధ్య ప్రసాదాన్ని ఆన్లైన్లో విక్రయిస్తున్నామని కొందరు సైబర్ మోసగాళ్లు ప్రకటించడంతో భక్తులు గందరగోళానికి గురవుతున్నారని, తాము ఆన్లైన్లో ప్రసాదాన్ని అమ్మడం లేదని, దీనికి సంబంధించి ఎలాంటి ఏజెన్సీ, వ్యాపార సంస్థలకు ఫ్రాంచైజీలు ఇవ్వలేదని ట్రస్ట్ క్యాంప్ ఆఫీస్ ఇన్చార్జి ప్రకాశ్ గుప్తా వివరించారు. రామ జన్మభూమి ట్రస్ట్ అనేది లాభాపేక్ష లేని సంస్థ అని, అయోధ్య రాముని దర్శించుకునే వారికి యాలకుల ప్రసాదాన్ని ఉచితంగా పంచుతామని, దానిని చెక్పాయింట్లను దాటి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడానికి అనుమతి లేదని తెలిపారు.
స్మారక స్టాంపుల విడుదల
అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకుని ప్రదాని నరేంద్ర మోదీ గురువారం స్మారక తపాల బిళ్లను, ప్రపంచ వ్యాప్తంగా రాముడిపై విడుదల చేసిన స్టాంపుల పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన రామ మందిరం, వినాయకుడు, హనుమాన్, జటాయు, కేవత్రాజ్, మాత శబరి స్టాంపులను విడుదల చేశారు. కాలం, సమాజం, కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా అందరితో రాముడు, సీత, రామాయణాలు ప్రతి ఒక్కరి జీవితంలో మమేకమై ఉన్నాయని ప్రధాని తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. రామాయణం మనకు ప్రేమ విజయాన్ని వివరించడమే కాక, త్యాగం, ఐకమత్యం, ధైర్యం, కష్టకాలంలో నిబ్బరంగా ఉండటం వంటి లక్షణాలను అందించిందని ప్రశంసించారు.
22న కేంద్ర ఉద్యోగులకు సగం రోజు సెలవు
అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగే 22న దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సగం రోజు సెలవును మంజూరు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఆ రోజు రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించేందుకు, వివిధ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలలో పాల్గొనడానికి వీలుగా సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సెలవు ఇస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న డిమాండ్, వారి మనోభావాలను గౌరవించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.