Acharya Satyendra Das | రాముడిని నమ్మని వారు.. సనాతన వ్యతిరేకులని రామజన్మభూమి ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ అన్నారు. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారికి ఆహ్వానించకూడదన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీలకు రామాలయం ఆహ్వానం పంపడంపై ఆయన స్పందించారు. ఒకప్పుడు రాముడి ఉనికిని కొట్టిపారేసిన వాళ్లు వీరేనని, ఇలాంటి శాశ్వత ప్రత్యర్థులను ఆహ్వానించాల్సిన అవసరం లేదని, రావాల్సిన అవసరం లేదన్నారు.
ఇదిలా ఉండగా.. అయోధ్య రామాలయంలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ నెల 22న జరిగే కార్యక్రమానికి దేశ, విదేశాల్లోని శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పలుకుతున్నది. ఒక్కొక్కరికి స్వయంగా ఆహ్వానం అందజేస్తున్నది. తీర్థ్ క్షేత్ర ట్రస్ట్తోపాటు ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ ప్రతినిధులు సైతం ఆహ్వానాలను అందజేస్తున్నారు.
ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, వ్యాపారవేత్తలు ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీలతో పాటు ఆహ్వానపత్రికలను తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ అందిస్తున్నది. అలాగే రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో కక్షిదారు అయిన ఇక్బాల్ అన్సారీకి ఆహ్వానం అందింది. రామాలయ నిర్మాణానికి బాబ్రీ మసీదు కూల్చివేసే క్రమంలో చనిపోయిన 50 మంది కర సేవకుల కుటుంబాలను సైతం వేడుకకు ఆహ్వానించారు.