Poll Schedule : సకాలంలో ఎన్నికల నిర్వహణ ప్రజాస్వామ్య పాలన కొనసాగింపునకు కీలకమని పేర్కొంటూ దేశవ్యాప్తంగా థర్డ్ వేవ్ వణికిస్తున్నా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో కొవిడ్-19 కేసులు అనూహ్యంగా పెరుగుతుండటంతో భద్రత కోసం జనవరి 15 వరకూ ఎన్నికలు జరిగే యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ర్యాలీలు, రోడ్షోలు, బహిరంగ సభలపై ఈసీ నిషేధం విధించింది.
ఆపై క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను సమీక్షించి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. కొవిడ్-19 నిబంధనలను అమలు చేస్తూ ఎక్కువ మంది ఓటర్లను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా దృష్టి సారించామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. అభ్యర్ధులు వీలైనంత ఎక్కువగా వర్చువల్ తరహాలో తమ ప్రచారం సాగించాలని కోరారు. రోడ్లపై కార్నర్ మీటింగ్లు నిర్వహించరాదని, కౌంటింగ్ తర్వాత విక్టరీ ర్యాలీలకు దూరంగా ఉండాలని ఈసీ స్పష్టం చేసింది.
ఓటర్లు, అభ్యర్ధులు, రాజకీయ పార్టీలు ప్రజారోగ్యం పట్ల అప్రమత్తతతో వ్యవహరిస్తూ కొవిడ్-19 ప్రొటోకాల్ను పాటించాలని కోరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, హోం శాఖ కార్యదర్శి, వైద్య నిపుణులు, ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులతో విస్తృతంగా చర్చించిన మీదట అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నామని ఈసీ స్పష్టం చేసింది.