న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్పై చర్యలు చేప్టటాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన మహిళా రెజ్లర్లకు (wrestlers) వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. రెజ్లర్లకు మద్దతుగా భారత రైతు సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రాకేష్ తికాయత్ గురువారం యూపీలోని అలీఘఢ్లో రైతుల మహాపంచాయత్ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
మహాపంచాయత్ నేపధ్యంలో అలీఘఢ్లో పెద్దసంఖ్యలో పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బ్రిజ్ భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో చేపట్టిన రెజ్లర్ల నిరసనలో వినేష్ పోఘట్, సాక్షి మాలిక్, భజరంగ్ పునియా వంటి ప్రముఖ రెజ్లర్లు పాల్గొన్నారు. మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురిచేసిన బ్రిజ్ భూషణ్ సింగ్ను తక్షణమే అరెస్ట్ చేయాలని, ఆయన తన పదవికి రాజీనామా చేయాలని గత కొద్దినెలలుగా రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు.
తమ డిమాండ్లను పరిష్కరించకుంటే మెడల్స్ను గంగా నదిలో విసిరేసి ఇండియా గేట్ వద్ద ఆమరణ దీక్ష చేపడతామని రెజ్లర్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. మరోవైపు తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను తోసిపుచ్చిన బ్రిజ్ భూషణ్ సింగ్ ఆరోపణలను నిరూపిస్తే తాను ఉరి వేసుకునేందుకు సిద్ధమని పేర్కొన్నారు. మరోవైపు తాను నార్కో అనాలిసిస్ టెస్ట్కు సిద్ధమని ఆయన చెబుతున్నారు.
Read More